‘సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్’ (సాస్) ఇప్పుడు చాలా విరివిగా వినిపిస్తున్న పదం. డిజిటల్ లావాదేవీలు ఐదేండ్లలో గణనీయంగా జరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు విజృంభించే వేళ ప్రజానీకం డిజిటల్ చెల్లింపుల బాట పట్టారు.
చిన్న, మధ్య, ఉన్నత వ్యాపార, వాణిజ్య వర్తకులు కూడా తమ లావాదేవీలకు డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. ఆన్లైన్లో వైద్య సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ జరిగాయి. ప్రాథమిక, ఉన్నతవిద్యా సంస్థలు డిజిటల్ సేవలను అందించాయి. ఆన్లైన్ మాధ్యమంలో విద్యార్థులకు అవిరామంగా బోధన చేశాయి. ఈ కార్యకలాపాలను నిరంతరాయంగా సాగించేవిధంగా ‘సాస్ సంస్థలు’ సేవలను అందించాయి. ‘వర్క్ ఫ్రం హోమ్’ అనే నూతన ఒరవడిలో ‘సాస్’ సంస్థల పాత్ర హర్షణీయం.
అత్యంత సంక్లిష్ట సమయంలో దేశానికి డిజిటల్ మౌలిక వసతిని అందించడం వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం. ఈ సమయంలో ప్రజానీకానికి అండగా నిలిచి ఎవరికి, ఏ తరహా సాంకేతికత అవసరమో అలాంటి సాఫ్ట్వేర్లను రూపొందించి, నిర్విరామ సేవలను కొనసాగించినయి ఈ సాస్ సంస్థలే. చిన్న, మధ్యతరహా వ్యాపారస్థులకు ఇవి తక్కువ ఖర్చులో సాఫ్ట్వేర్ సేవలనందించాయి. ప్రతి వినియోగదారుడికి అవసరమైన వెబ్సైట్, యాప్స్, ఇ-మెయిల్స్, ఎస్.యం.ఎస్, క్లౌడ్ స్టోరేజీ, సైబర్ రిస్క్ నియంత్రణ, ఈ.ఆర్.పి, సి.ఆర్.యం, డిజిటల్ మార్కెటింగ్, ఏ.ఐ. వంటి డిజిటల్ వసతులను అందిస్తూ ఈ సాస్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
కరోనా కాలంలో సాస్ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు పెంపొందిస్తున్న డిజిటల్ సేవల మూలాన డిజిటల్ వసతులను కొని అట్టిపెట్టుకొనే విధానానికి ముగింపు పలికినట్టయింది. నెలవారీ చెల్లింపులకు సేవలనందిస్తూ సాంకేతిక రంగంలో వినూత్నమైన వెసులుబాటు నెలకొల్పాయి. ఈ సాస్ సంస్థల ఫలితంగా వ్యాపారస్థులకు సాంకేతికతపై వెచ్చించే మూలధన వ్యయం అంటే సర్వర్ల కొనుగోలు, సాఫ్ట్వేర్ లైసెన్స్లపై ఖర్చు చాలావరకు తగ్గింది. సాఫ్ట్వేర్ సాంకేతికత వినియోన్ని కూడా చాలా సులభతరం చేయటం వల్ల వ్యాపారస్థులు తమ వాణిజ్య కార్యకలాపాలను స్వల్పకాలంలోనే ఆన్లైన్లో కొనసాగించ గలుగుతున్నారు. కరోనా కారణంగా మన దేశ సాస్ సంస్థలు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందాయి. ఇతర దేశాలకు సైతం సేవలు అందిస్తూ తమ ఆదాయాలను విదేశీ కరెన్సీలో పొందడం ద్వారా చాలా లాభపడుతున్నాయి.
ఈ సాస్ సంస్థల సేవలను వినియోగించుకోవటంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఇవి చాలావరకు ఇంటర్నెట్ ఆధారితమైనవి. సాస్ సేవలు పొందాలంటే ఇంటర్నెట్ కనెక్షన్లోఅవరోధాలు ఉండకూడదు. ఇందుకు హై బ్యాండ్విడ్త్ కనెక్షన్ అవసరం. వ్యాపార సమాచార చౌర్యంతోపాటు ప్రైవసీ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా సాస్ సంస్థలు హామీ ఇస్తే బాగుంటుంది.
బెంగళూరు ఆధారిత ‘ఫ్రెష్వర్క్స్’ అనే సాస్ సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ మాత్రుభూతం అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్సేంజీలో భారత సాస్ సంస్థల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. తమ సంస్థను అమెరికాలోని నాస్డాక్ స్టాక్ఎక్సేంజీ శిఖరాన్ని అధిరోహించి ప్రతి భారతీయుడి మన్ననల్ని పొందాడు. ‘ఫ్రెష్వర్క్స్’ సంస్థ నుంచి ఇతర సాస్ సంస్థలు స్ఫూర్తి పొందాలి. ‘సాస్’ సంస్థలు తమ సేవలను ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తూ నేటి యువతకు అనేకానేక ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ఆశిద్దాం.
డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్)