పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్, దిరుగుచున్, లక్షించుచున్ సంతత
శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా!
(భాగవతం 7-123)
ఇది ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందులో మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘సర్వదా నారాయణ స్మరణం, విశ్వాన్ని విస్మరించడం.. ప్రహ్లాదుడి నిత్యకృత్యాలు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, కబుర్లు చెప్తూ, నవ్వుతూ, నిదురిస్తూ, ఊళ్లో తిరుగుతూ, అటూ ఇటూ చూస్తూ, ఏ పనులు చేస్తున్నప్పటికీ నారాయణుని పాద పద్మ యుగళం పైనే ఎప్పటికీ తన చింత నిలిపి, ఆ చింత అనే అమృత ఆస్వాదనలోనే ఈ విశ్వాన్నంతా మరిచిపోయాడు’ అని పై పద్యభావం. ఇందులో చివరి మాట ముఖ్యం. విశ్వాన్ని మరిచిపోవడం ఏమిటి? అంటే ఇక్కడొక విశ్వం ఉన్నది. ఆ విశ్వంలో తానున్నాననే ధ్యాసను ప్రహ్లాదుడు మరిచిపోయాడన్నమాట.
మామూలుగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. కొన్ని మరచిపోవలసినవి కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం ఎంత అవసరమో, మరచిపోవడం కూడా అంతే అవసరం. కానీ, మనకు నియంత్రణ లేని కారణంగా అన్నీ గుర్తుపెట్టుకోవాలని, ఏదీ మరచిపోవద్దని అనుకోవడం సహజం. మరచిపోదగినవి ఎన్నో ఉన్నాయి. గుర్తుపెట్టుకోదగినవీ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి. అంటే, మతిమరుపును మనం సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ప్రహ్లాదుడు వినియోగించుకున్నాడు. ఏదంటే అది మరచిపోగలిగిన వాడు, ఏదంటే అది గుర్తుపెట్టుకోగలిగినవాడు, ఆ నియంత్రణ కలిగినవాడు కాబట్టి ప్రహ్లాదుడి
మతిమరుపు పనికొచ్చేది. ప్రహ్లాదుడు విశ్వాన్ని విస్మరించి, విశ్వవిఖ్యాతుడయ్యాడు. మనం విశ్వాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటున్నాం. అది తప్ప మనకు మరో ధ్యాస లేదు. అయినా ప్రహ్లాదుడి ప్రసిద్ధి మనకు రావడం లేదు. అందుకే ఆయనది పనికొచ్చే మతిమరుపు. ఇందులోని మర్మం ఏమంటే, ప్రహ్లాదుడు నారాయణుడిని గుర్తుపెట్టుకున్నాడు. లోకాన్నంతా మరిచిపోయాడు. ఒక్క శ్రీహరిని గుర్తుపెట్టుకుంటే చాలు, విశ్వాన్నంతా మరిచిపోయినా చింతించే పనిలేదని స్పష్టమవుతున్నది. మరొక విశేషమేమంటే, ప్రహ్లాదుడికి మతిమరుపు వచ్చింది అనలేదు కవి. అలా పేర్కొని ఉంటే ప్రహ్లాదుడు ఒకడున్నాడు, అతనికి మతిమరుపు ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ మతిమరుపునకు ప్రహ్లాదుడు కర్త కాదు. కానీ, ‘ప్రహ్లాదుడు మరిచిపోయాడు’ అన్నాడు పోతన. అంటే అతను బుద్ధి పూర్వకంగా మరిచిపోయాడని అర్థం చేసుకోవాలి. అతను ఏది మరిచిపోవాలంటే దాన్ని మరిచిపోగలడు. గుర్తుంచుకోవాలనుకున్న దానిని గుర్తుపెట్టుకోగలడని అర్థం.
‘ఇందులో గొప్ప ఏమిటి?’ అన్న అనుమానం రావచ్చు. మనకు ఆ నియంత్రణ లేకపోవడం వల్ల గత జీవితంలోని విషాద సన్నివేశం తటాలున స్మృతిపథంలో మెదిలి మనలను నిర్వీర్యులను చేస్తున్నది. అందుకే చాలామంది అలాంటి వాటిని మరిచిపోవడానికి రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారుతుంటారు. పైగా, బాధను మరిచిపోవడానికి వ్యసనాల దారి పట్టానని గొప్పగా చెప్పుకొంటారు. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు.
మొత్తానికి పరిశీలిస్తే ఏవి మరిచిపోవాలి, వేటిని గుర్తుంచుకోవాలనే అంశాలు ఒక పట్టిక తయారుచేసుకొని సాధన చేసే వ్యవస్థ ఒకప్పుడు ఉండేదేమో! ప్రహ్లాదుడు మరిచిపోదగిన వాటిని ఒక పట్టికగా రాసుకుంటే అందులో ‘విశ్వం’ అనేది ఉండి ఉంటుందన్నది నిర్వివాదం. యథార్థానికి లోకాన్ని మరిచిపోవడం కుదిరేది కాదు. కానీ, లోకేశ్వరుడిని నిరంతరం గుర్తుపెట్టుకోగలిగినవాడికి మాత్రం అది సాధ్యమే. అప్పుడు లోకాన్ని విస్మరించడం వల్ల ఏ నష్టమూ ఉండదు. పైగా అన్ని ప్రాణాపాయ పరిస్థితులలో రక్షణతో కూడిన ప్రయోజనమే కలుగుతుందని ప్రహ్లాద చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు.
– డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ
94411 62863