సమాచారం పొందడం పౌరుల హక్కు. సరైన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్. అయిదేండ్లలో రికార్డు స్థాయిలో 30 వేల పిటిషన్లను పరిష్కరించి ప్రజల మన్ననలు అందుకున్నది. ప్రస్తుతం సగటున 6 నెలల్లో పరిష్కారమయ్యే పిటిషన్ల సమయాన్ని 3 నెలలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. పిటిషన్లను మానవతా దృక్పథంతో పరిశీలిస్తూ సామాన్యులకు న్యాయం జరగడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నది.
పది రూపాయల రుసుముతో తమకు అవసరమైన సమాచారాన్ని పొందే సౌలభ్యం సమాచార హక్కు (సహ) చట్టంలో ఉంది. 30 రోజుల్లోపు సమాచార అధికారి సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతున్నది. ఆ అధికారి నుంచి లేదా అతడి పై అధికారి నుంచి తాము అడిగిన సమాచారం రాకపోతే దరఖాస్తుదారులు సమాచార కమిషన్ను ఆశ్రయించవచ్చు. వారి పిటిషన్ను ఎంత కాలంలో పరిష్కరించాలి అనే నిబంధన లేదు. కానీ సామాన్యుల కోసం ఉద్దేశించిన ఈ సౌకర్యాన్ని కొందరు అదే పనిగా ఎక్కువ సంఖ్యలో పిటిషన్లు వేసి ఇతర పిటిషన్దారులకు న్యాయం ఆలస్యమయ్యేలా చేస్తున్నారన్న విమర్శ ఉంది. అయితే రాష్ట్ర సమాచార కమిషన్ మానవతా దృక్పథంతోనూ, పౌరుల అత్యవసరాలను గమనించి, అలాంటి పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తున్నది. ఉదాహరణకు 80 ఏండ్ల వృద్ధురాలు తన కొడుకు నుంచి జీవన భృతి పొందడం కోసం కోర్టులో కేసు వేసింది. కోర్టుకు సాక్ష్యంగా కుమారుడి వేతన పత్రం కావాలని కమిషన్కు దరఖాస్తు చేసింది. ఆవిడ వయస్సును, ఆవిడ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేసును కమిషన్ త్వరగా పరిష్కరించింది.
సమాచార హక్కు చట్టం వల్ల సామాన్యులకు నిజంగా ప్రయోజనం కలగాలి, సత్వరమే సమాచారం లభించాలి అంటే, మూకుమ్మడి పిటిషన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇలాంటి మూకుమ్మడి పిటిషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం పనిలో 75 శాతం పని ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానం ఇవ్వడంతోనే సరిపోతున్నదని సుప్రీంకోర్టు ఒక తీర్పులో వ్యాఖ్యానించింది.
2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఈ చట్టం గురించి సామాన్యులకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించింది సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, ఉద్యమకారులే. తప్పు చేసినా పట్టుబడం అని భావించే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు భయపడేట్టు వారు చేయగలిగారు. సమాచార హక్కు ఉద్యమకారుడిగా ప్రజా ప్రస్థానం ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి ఢిల్లీ రాష్ర్టానికి సీఎం అయ్యారు. వ్యవస్థలో మార్పు తేవాలనుకునే ఆశయం కలిగినవారికి ఆర్టీఐ ఒక ఆయుధమనడానికి కేజ్రీవాలే ఉదాహరణ. అయితే సహ చట్టం ఉద్యమకారుల పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
2017 సెప్టెంబర్ 25న తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పడింది. తొలి ప్రధాన కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాజా సదారామ్ 2020 ఆగస్ట్లో పదవీ విరమణ చేశారు. ఆనాటి నుంచి నేను ప్రధాన కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కట్టా శేఖర్ రెడ్డి, గుగులోత్ శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైడా నారాయణ రెడ్డి, మహమ్మద్ అమీర్ హుసేన్లను సమాచార కమిషన్ కమిషనర్లుగా నియమించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకుని ఈ ఐదేండ్లలో కమిషన్కు మొత్తం 38 వేల పిటిషన్లు అందా యి. వీటిలో 31 వేల పిటిషన్లను ఐదేండ్లలో పరిష్కరించాం. మూకుమ్మడి పిటిషన్లను మూకుమ్మడిగా పరిష్కరించడం వల్లనే ఇది సాధ్యమైంది.
(వ్యాసకర్త: పధాన కమిషనర్ (యఫ్ఏసీ), తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్)
-బుద్దా మురళి