జీవిత పాఠాలు నేర్పే వేమన శతకం, నీతి పద్యాల నిధి సుమతి శతకం, లోక జ్ఞానం పెంచే భాస్కర శతకం, సద్గుణాలు పెంచే దాశరథి శతకం, ధర్మనిరతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వరా శతకము, కుమార శతకం, కుమారి శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం.. ఇలా తెలుగు వారికి సుపరిచతమైన శతకాలెన్నో ఉన్నాయి. అందులో ప్రతి పద్యం ఒక లక్ష్యంతో ఉంది. వందల శతకాలలో వేల పద్యాలు తెలుగు నేలలో వ్యాప్తిలో ఉన్నాయి. ఒకప్పుడు చదువులకు కొలమానంగా పద్యాలు అనర్గళంగా పాడటం ఉండేది. కానీ నేడది కరువైంది. పాఠ్య పుస్తకాలలో ప్రాథమిక తరగతుల నుంచి పదవ తరగతి వరకు ‘నీతి పద్యాలు’తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉన్నది.
సాధారణంగా కావ్యాలు, సాహిత్య ప్రక్రియలు పండితులకు మాత్రమే పరిమితమైనవిగా, విద్వాంసులకు మాత్రమే అర్థమయ్యేవిగా ఉంటాయి. శతకాలు మాత్రం సామాన్య ప్రజల్లో విశేషాదరణ పొందాయి. ఇలా తెలుగులో శతక సాహిత్యం సామాన్యునికి- పండితునికి మధ్య వారధిగా నిలిచింది.
తెలంగాణ ప్రజలకు భాష ఓ పిలుపు మాత్రమే కాదు. చరిత్ర మారినా చెదరని అస్తిత్వం. అందుకే తెలంగాణ ఘన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ చెలిమెను నిర్వహిస్తున్నది మన పత్రిక. అలసిసొలసిన వేళల్లో కళారూపాలైనా, పోరుబాటల్లో పాటలా మారినా, ఆత్మగౌరవాన్ని కథతో నినదించినా…
తనదైన శైలి తెలంగాణది. ఆ సాహిత్యంలో మీకు ఎలాంటి అభిరుచి ఉన్నా, కలాన్ని కదిలించండి. ఆసక్తిగా, సూటిగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయండి…
తెలుగు సాహిత్య ప్రక్రియలలో సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకోవటానికి వీలుగా ఉన్నవి శతకాలు. ఎంతో లోతైన భావాలను వాడుక భాషలోని పదాలతో చెప్పి, సామాన్యున్ని జ్ఞానిని చేయగలిగినవి శతకాలు. పద్యాల ద్వారా సమాజానికి నీతిని భోదించి, జ్ఞానాన్ని వికసింపజే యవచ్చని నిరూపించాయి మన తెలుగు శతక పద్యాలు.
తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకం రాసే విధానం ప్రారంభమైనట్లు చరిత్రకారులు గుర్తించారు. ఈ ఎనిమిది వందల పైగా సంవత్సరాల్లో తెలుగు శతకం శాఖోపశాఖలుగా వ్యాపించి స్వరూపంలో, స్వభావంలో ఎంతో మార్పు చెందింది. భారతీయ భాషలలో ఎందులోనూ తెలుగులో వలె శతక ప్రక్రియ ప్రత్యేకతను సంతరించుకోలేదు. ఇప్పుడు కూడా ఎక్కడో ఒకచోట తెలుగులో శతకం వెలువడుతూనే ఉన్నది. నదీ ప్రవాహం లాగా శతక ప్రక్రియ తెలుగు నేలపై
ప్రవహిస్తూనే ఉన్నది.
శతకం అంటే 100 లేదా 108 పద్యాల సంకలనం. శతకంలోని అన్ని పద్యాలు ఒకే వృత్తంలో ఉంటాయి. అన్నింటికి ఒకే మకుటం ఉంటుంది. ఈ మకుటాన్ని బట్టి ఆ పద్యం ఏ శతకానికి చెందినదో సులువుగా గుర్తించవచ్చు. మకుటం అనేది ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు.
శతకాలలో భక్తికి సంబంధించినవి, సమాజానికి ఉపయోగకరమైనవి, నీతిని తెలియజేసేవి.. ఇలా ఎన్నో అంశాలను కలిగి ఉన్నాయి. చిన్నారులకు మాటలు పలకటం వచ్చిన నాటి నుంచి మనం వీటిని నేర్పించటం వల్ల వారికి స్పష్టమైన ఉచ్ఛారణ అలవాటు అవుతుంది. మాతృభాషపై పట్టు పెరిగి అదే విధానంలో, భావ వ్యక్తీకరణను తెలుసుకుంటాడు. జ్ఞాపక శక్తీ వృద్ధిచెంది భవిష్యత్తులో ఉన్నతుడిగా ఎదిగే అవకాశం ఉన్నది. శతకాలు అనేవి పురాణాలు, ప్రబంధాలు, గేయాకృతుల వలె కథ అంశాలు, వర్ణనా ప్రాధాన్యాలు, సంగీత ప్రాధాన్యాలు కావు. కానీ తెలుగు నేలలో పండిత పామరులనే తేడా లేక, పిల్లలు, పెద్దలు అనే తేడా లేక ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా శతక సాహిత్యం ఉన్నది. తెలుగుకు సమాంతరంగా ఉన్న కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వెలువడిన శతకాల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభమైనా ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యం అంతంత మాత్రమే. సంస్కృత భాషలో కూడా శతకాలు ఎక్కువగా లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యం ప్రత్యేకతను చాటుకున్నది.
శతకంలో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలు గానీ, పూర్తి చరణం గానీ ఉండటం ఆనవాయితీ. దీన్ని మకుటం అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినుర వేమ! అనేది వేమన శతకానికి మకుటం. అలాగే సుమతీ అనేది సుమతీ శతకానికి మకుటం. అలాగే వేంకటేశ్వరా, దాశరథీ, కుమార అనునవి మకుటాలే.
శతక సాహిత్యానికి ఉన్న ఒక గొప్ప గుణం ఏమంటే.. జీవితాన్ని, బతకాల్సిన విధానాన్ని చక్కగా సరళ వ్యావహారిక భాషలో తెలియజెప్పడం. శతక రచయితల ముందుచూపు ఎంత గొప్పదంటే శతకాల్లో చెప్పిన విషయాలు, నీతి సూత్రాలు అన్ని కాలాలకు వర్తించేవిగా ఉంటాయి. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో శతక పద్యాలు చదివించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. శతకాలను పరిశీలిస్తే అవి రాయబడిన కాలాల సామాజిక పరిస్థితులనే కాదు, ప్రస్తుత పరిస్థితులకూ అనుకూలంగా ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యమే తప్ప, ఒక పద్యానికి మరొక పద్యానికి సంబంధం ఉండదు. ఒక పద్యానికి మరో పద్యానికి చెప్పే నీతి లేదా విషయం వేర్వేరుగా ఉంటుంది. శతకాల్లో కవి తన అనుభవాలను, ఆలోచనలను, అభిప్రాయాలను, తప్పులను, కోరికలను, మంచిని, నీతిని తెలియజేస్తూ అవి పాటించాలని లేదా జీవితంలో ఉపయోగించుకోవాలని ఆశిస్తాడు.
తెలుగు వారికి మొదట గుర్తుకువచ్చేది వేమన పేరే. వేమన ఒక ప్రజాకవి. సామాజిక బాధ్యతను, నీతిని, విలువలను వివరించారు. వేద వేదాంత, విజ్ఞాన, శాస్త్ర సంబంధ విషయాలతో కూడా వీరి పద్యాలు తెలుగువారి మన్ననలు పొందాయి. సుమతి శతకం కూడా ఒక నీతి శతకంగా, సామాన్యునికి సులభంగా అర్థమయ్యేదిగా ప్రశంసలు అందుకుంది.
తెలుగులో వచ్చిన శతకాల్లో ప్రత్యేకమైనది భాస్కర శతకం. ప్రతి పద్యంలోను మొదటి పాదంలో కవి ఒక సత్యాన్ని చెబుతాడు. మిగిలిన పాదాలలో పైన చెప్పిన సత్యాన్ని సమర్థించేందుకు ఒక ఉదాహరణ చెప్తాడు. ఇందులో 106 పద్యాలున్నాయి. భాస్కర శతకం నీతి శతకంగా ప్రసిద్ధి గాంచినప్పటికి ఇందులో ప్రగతిశీల భావాలున్నాయి.
శతకంలో కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక శతక పద్య రచనలో కవికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. చదివే వ్యక్తికి కూడా గంటలకొద్దీ, రోజులకు రోజులు చదవాల్సిన అవసరం లేదు. ఒక్క పద్యంతోనే, చదువుతున్న వ్యక్తికి కవి పై ఒక అభిప్రాయం కలిగేలా ఉంటుంది. శతకాలలోని పద్యాలు విషయాన్ని సులభంగా చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజల్లో ఎక్కువ ప్రాచుర్యం పొంది, ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి.
సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజ పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక విలువలను పెంపొందించేందుకు శతక కవులు కృషిచేశారు. నాటినుంచి నేటి దాకా సమాజ గమనానికి వెలుగు దివ్వెలు ఈ శతకాలే అనటంలో అతిశయోక్తి లేదు.