ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను పణంగా పెట్టే అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకొని శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాలను విభజించడం ఈ జాగ్రత్తల్లో కీలకమైనది. రాజ్యాంగాన్ని అనేక విభాగాలుగా మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించి, వివిధ వ్యవస్థల అధికారాలు, పని విధానాల గురించి సవివరంగా పొందుపరిచారు.
‘మన రాజ్యాంగంలో 11వ విభాగం పూర్తిగా ‘కేంద్ర,రాష్ట్ర సంబంధాలు-సహకారం’ గురిం చే వివరిస్తుంది. కేంద్రం, రాష్ర్టాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల విభజన భారత రాజ్యాంగం విశిష్ట లక్షణమని అంబేద్కర్ 1949లో రాజ్యాంగ రచన కమిటీ సమావేశాల్లో చెప్పారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ర్టాలకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో చేర్చని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం కేంద్రానికే ఇచ్చింది. కానీ కేంద్రం ఇంతగా రాష్ర్టాల అధికారాల్లో జోక్యం చేసుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండకపపోవచ్చు. కేంద్రం రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో అమలుచేస్తుందనీ.. రాజ్యాంగ పీఠికను ఆచరిస్తారనీ భావించి ఉండవచ్చు. మూడో అధికరణను కేంద్రం ఎన్నటీకీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అమలుచేయదని 1949లో సర్దార్ పటేల్ స్వయంగా రాజ్యాంగ నిర్మాణ సభకు హామీ ఇచ్చారు. పటేల్ ఇచ్చిన హామీని కూడా కేంద్రం ఉల్లంఘించటం చూస్తున్నాం.
2014లో అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం గత ఏడేండ్లుగా ఒక పథకం ప్రకారం రాష్ర్టాల హక్కులు హరి స్తూ, భారత సమాఖ్య స్వరూపాన్ని దెబ్బ తీసి, ఏక కేంద్ర విధానంగా మార్చటానికి ప్రయత్నిస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ హయాంలో రాష్ర్టాల హక్కులను హరించటానికి ప్రయత్నిస్తే, నాటి ముఖ్యమంత్రులు జ్యోతిబసు, ఎన్.టి. రామారావు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్ అబ్దుల్లా, ఇ.కె. నయనార్ వంటి వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఫలితంగా ఇందిరాగాంధీ కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మార్పు లు సూచించటా నికి ‘సర్కారియా కమిషన్’ను నియమించారు. ఈనాడు బీజేపీ ప్రభుత్వం భారత సమాఖ్య విధానంపై దాడులు చేస్తూ, కేంద్ర ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతో అధికారాలను తన గుప్పిట పెట్టుకోవటానికి చట్టాల్లో మార్పులు, సవరణలు తెస్తుండటం గమనార్హం.
గత పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలు సమాఖ్య విధానానికి పూర్తిగా విరుద్ధమైనవి. వ్యవసాయం పై చట్టాలు చేస్తే రాష్ర్టాలతో సంప్రదించి మాత్రమే చేయాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా రాష్ర్టాలతో చర్చించకుండా, అప్రజాస్వామికంగా పార్లమెంట్లో సమగ్ర చర్చ లేకుండా ఆమోదించింది. భారతదేశం వంటి విశాలమైన భిన్న వాతావరణం గల దేశంలో ఏ పంటలు పండించాలో స్థానిక పరిస్థితులను బట్టి రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. కానీ మోదీ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలు చేసింది. దీంతో రైతుల ఉద్యమాలకు తలవంచి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
మోదీ ప్రభుత్యం చేసిన అనేక నిర్ణయాలు రాష్ర్టాల హక్కులకు, అధికారాలకు శరాఘాతంగా మారాయి. బీజేపీ సమాఖ్య విధానంపైనే కాకుండా, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై కూడా దాడులు చేస్తున్నది. న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నది.
కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐపై కేంద్రం తన అధిపత్యాన్ని చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తునకు ఆదేశించినా, సీబీఐ ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాలని ‘డీపీఎస్ఈ’లోని ఆరో సెక్షన్ నిర్దేశిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోతే సీబీఐ అధికారులకు 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పోలీసు అధికారులకు ఉండే దర్యాప్తు అధికారాలు లేకుండా పోతాయి. అలాంటప్పుడు రాష్ట్ర హైకో ర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన కేసులను మాత్రమే సంబంధిత రాష్ర్టాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలి. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇష్టులైనవారి మీద దర్యాప్తును నత్తనడకగా సాగిస్తూ, ప్రత్యర్థుల మీద మాత్రం ఒంటి కాలి మీద లేస్తున్నదని ఇటీవలి సీబీఐ వ్యవహారం తేటతెల్లం చేస్తున్నది.
కేంద్రం ప్రకటించిన ‘నూతన విద్యావిధానం-2020’ద్వారా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతతత్వీకరణ (3’సి’ లు) జరుగుతుందని దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. రాజ్యాంగ రచనా సమయంలో రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. ప్రస్తుతం విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా ఉండాలి. కానీ ‘నూతన విద్యావిధానం-2020’ ప్రకటించే సమయంలో కేంద్రం రాష్ర్టాలతో సంప్రదించలేదు. యూజీసీ వంటి సంస్థలను రద్దు చేసింది. డిగ్రీ కోర్సులలో మార్పులు, సిలబస్ తయారీ, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ.. మొదలైన అంశాలన్నీ నూతన విద్యావిధానం ద్వారా కేంద్రం ఆధీనంలోకి వెళ్లనున్నాయి.
భారత ప్రభుత్వమంటే రాష్ర్టాల సమాఖ్య. మోదీ ఆ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజావ్యతిరేకమైనవి. తత్వవేత్త రూసో చెప్పినట్లు ‘ప్రజాభిప్రాయయే అన్నిటి కంటే బలమైనది’. మోదీ స ర్కార్ ప్రజలను విస్మరించి, రాష్ర్టాల హక్కులను హరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే.. వ్యవసాయ చట్టాల స్థితి వస్తుందని మరువద్దు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీసుకునే నిరంకుశ చర్యలపై తెలంగాణ సమాజం పోరాటం చేస్తది. రాష్ర్టాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న కేంద్రం మెడలు వంచేందుకు, రాష్ర్టాల ను జాగృత పరిచేందుకు మరో పోరా టం చేయడానికి సైతం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని కేంద్రం గ్రహిస్తే మంచిది.
– బండారి జితేందర్
93935 41667
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)