ఇటీవలి కాలంలో అణగారిన వర్గాల ఎదుగుదలను బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు అణచివేస్తున్నారు. వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఆ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ నైతికత, రాజ్యాంగంలో పేర్కొన్న విలువలు తరిగిపోతున్నాయి. భారత ఎన్నికల సంఘం, భారత అటార్నీ జనరల్ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు అనుగుణంగా తమ విధులను నిర్వహించడం లేదు. కొన్ని రాష్ర్టాలలో ప్రత్యేకంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాలలో గవర్నర్ల ప్రవర్తనతో భారత రాజ్యాంగం అపహాస్యానికి గురవుతున్నది.
భారత రాజ్యాంగంలోని 153 అధికరణం ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక గవర్నర్ను నియమించాలి. ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాలకు గవర్నర్గా నియమించవచ్చు. 154 అధికరణం ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం గవర్నర్ చేతిలోఉంటుంది. గవర్నర్ తన కార్యనిర్వహణ అధికారాన్ని తనుగాని, దానికోసం నియమించబడిన అధికారుల చేత కానీ నిర్వహించవచ్చు. 163 అధికర ణం ప్రకారం రాష్ట్ర పరిపాలనా నిర్వహణ కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. రాజ్యాంగానుసారం స్వయం వివేచనతో నిర్వహించే అంశాలు మినహా ఇతర అన్ని విషయాల్లో గవర్నర్ మంత్రివర్గ సలహాలను పాటించాలి.
1974లో షంషేర్ సింగ్, స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ భారత రాజ్యాంగంలోని 66వ అధికరణంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా నియమాలు పాటించడం ద్వారా గవర్నర్ అన్ని అధికారాలను, విధులను నిర్వహించవచ్చు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి లేదా గవర్నర్ పరిధిని తెలుపుతూ అధికరణం 123 (రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీచేయుట) , 213 (గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేయుట ), 311(2) (అఖిల భారత ఉద్యోగుల హోదా తగ్గింపు, బర్తరఫ్ చేయుట ), 317 (పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల) 352 (యుద్ధం, దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు మూలంగా ప్రమాదం పొంచి ఉంటే), (75వ అధికరణం) కేంద్ర మంత్రివర్గం లిఖిత పూర్వకంగా ఒక్క తీర్మానాన్ని ఆమోదించినట్లయితే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించవచ్చు), 356 (రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించుట), 360 (దేశంలో ఆర్థ్ధిక అత్యవసర పరిస్థితిని విధించుట) మొదలగు రాజ్యంగం పేర్కొన్న అంశాలను పాటించాలి. ఇవన్నీ కూడా మంత్రివర్గ సూచనలు, సలహాల ప్రకారం గవర్నర్ తన కార్యనిర్వహణ అధికారాలుగా చెలాయిస్తారు.
గవర్నర్ తన విచక్షణాధికారాలను కేవలం రాష్ట్రపతి పాలన సమయంలో మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉన్నది. ఇతర అధికారాలు కూడా మంత్రి వర్గంతో సామరస్య పూర్వకంగా నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకానీ సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించలేదు. గవర్నర్ తీసుకునే ప్రతి కార్యనిర్వహణ చర్యకు మంత్రులు బాధ్యత వహిస్తారు. అంటే మంత్రి వర్గం వ్యక్తిగతంగా గవర్నర్కు, సమిష్టిగా శాసన వ్యవస్థకు బాధ్యత వహించాలి. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మూలతత్వము. మంత్రి మండలిలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎందుకంటే మంత్రిమండలిలో సభ్యులను నియమించటం, బర్తరఫ్ చేయటం ముఖ్యమంత్రి అబీ ష్టం మేరకు గవర్నర్ చేసే విధి. గవర్నర్ చట్టం, రాజ్యాంగం ప్రకారం బాధ్యతగా తన విధులు నిర్వహించాలని రాజ్యాంగ పరిషత్ చెప్పింది
రాజ్యాంగంలోని క్లాజులు, నియమాలకు అనుగుణంగా మాత్రమే గవర్నర్ తన విధులు నిర్వహించాలి. అవసరమైతే న్యాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. అంతేకానీ గవర్నర్ తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు.
కానీ ప్రస్తుత గవర్నర్ వ్యవస్థ పూర్తిగా అందుకు భిన్నంగా పనిచేస్తున్నది. శాసనసభ ఆమోదించిన బిల్లులను అంగీకరించుట, లేదా తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉన్నప్పటికీ మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. అలాగే ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలలో జోక్యం చేసుకోరాదు. కానీ ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాలలో గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాజ్యంగాన్ని అవమానపరుస్తున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే న్యాయవ్యవస్థ జోక్యం తప్పనిసరి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గవర్నర్ ఆమోదానికి పంపింది. కానీ నిబంధనల పేరుతో తమిళిసై వారి నియమకాన్ని అడ్డుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ నేతలిద్దరూ ఉద్యమనాయకులు. అటువంటి నాయకులు ప్రజాసేవలో ఉండకుం డా గవర్నర్ అడ్డుకోవటం సరికాదు. దీనికి తమిళిసై సమాధానం చెప్పాల్చిందే. రాజకీయాలే వారి ఎంపికకు అడ్డు అయితే, సర్కారియా కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం గవర్నర్ తమిళిసై ఆ పదవిలో ఉండకూడదు.
బీజేపీకి చెందిన గులాం అలీ కటహాను రాష్ట్రపతి కోటలో కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. అంతేకాదు మోహన్ జెఠ్మలాని, సోనాల్మన్సింగ్, రాకేశ్ సిన్హా ఇలా చాలామంది బీజేపీ నాయకులు రాష్ట్రపతి కోటలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరి వీరేం సంఘసేవకులు కాదు కదా! మరి రాజ్యసభకు ఎలా నామినెట్ అయ్యారు. ఈ విషయంలో గవర్నర్ తమిళిసై సమాధానం చెప్పాలి.