యద్య దాచరతి
శ్రేష్ఠస్తత్త దేవేతరో జనఃస
యత్ప్రమాణం కురుతే
లోక స్తదనువర్తతే॥
‘ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది’ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. కానీ.. ఉత్తములు కాకుండా ఎవరికి వారు అవసరమైనప్పుడల్లా ఇలాంటి ప్రమాణాలు చేస్తూ పోతే.. మిగతా వారూ వాటిని ఆచరిస్తే… ఆ ప్రమాణాలకు విలువేముంటుంది? ఒకరు చేసే ప్రమాణం సకల జనులకు స్ఫూర్తిగా నిలవాలే కానీ.. తప్పుడు ప్రమాణాలు చేసే వైపు వారిని మళ్లించకూడదు.
రాష్ట్రంలో ఇప్పుడు ప్రమాణ మంత్రాలతో రాజకీయ తంత్రాలు కొనసాగుతున్నాయి. ఫక్తు హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ నేతలు దానికి అంకురార్పణ చేశారు. తమపై విమర్శలు వచ్చినా.. ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నా ప్రమాణాలనే ప్రామాణికంగా చూపుతున్నారు. దానికి దేవుళ్లను అడ్డుపెట్టుకుంటూ పరోక్షంగా మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సమయంలో ప్రజలకు నిజాయితీగా సేవలందిస్తానని చేసిన ప్రమాణాలకంటే.. ఇప్పుడు చేస్తున్న ప్రమాణాలు ఎంతవరకు ప్రామాణికం? తానొక ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి కేవలం రాజకీయ నాయకుడిగా ఆలయాలకు వెళ్లి ప్రమాణాలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా?
‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరిపామని బీజేపీ మీద, మా నాయకుల మీద టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ఆలోచన మాకు లేదు. లక్ష్మీనరసింహ స్వామి మా ఇలవేల్పు. ఇది పవిత్ర స్థలం. నేను తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. ముఖ్యమంత్రి మాత్రం రాలేదు. అది వాస్తవం కాదు, తప్పుడు ఆరోపణ అని ప్రమాణం చేస్తున్నా…’
– బండి సంజయ్
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది. తొలుత ఈ కేసులో నిందితులకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఆ పార్టీ నేతలు.. వారి తరఫున కోర్టులో పిటిషన్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? మొయినాబాద్ ఫాంహౌజ్లో కుట్ర జరిగిన సమయంలో అక్కడున్న నిందితులు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్కు ఎందుకు మెసేజ్లు చేశారు? ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ప్రమేయం ఉందనడానికి ఈ సాక్ష్యాలు చాలవా? ఇన్ని రుజువులు బయటపడ్డా బండి సంజయ్ మాత్రం ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిలోకి వెళ్లి తులసిమాల, అక్షింతలపై ప్రమాణం చేయడం అటు దేవుడిని, ఇటు ప్రజలను మోసం చేసినట్లు కాదా?
ఇలా ఒకటీ రెండూ కాదు.. రాజకీయంగా ఎప్పుడు ఆరోపణలు చేసినా ప్రమాణాల పాట పాడటం బీజేపీ చీఫ్కు అలవాటైపోయింది. మునుగోడు ఎన్నికల సమయంలో గొర్రెల పంపిణీ డబ్బుల విషయంలోనూ ఇలాగే వ్యవహరించిన బండి… నేను కుటుంబంతో సహా శివాలయానికి వస్తా.. సీఎం రావడానికి సిద్ధమా? ఇద్దరం ప్రమాణం చేద్దామంటూ అదే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ల్లో ఎన్ని నెరవేర్చారో రాజశ్యామల యాగం చేసేటప్పుడు ప్రమాణం చేయాలనీ పాత పాటే పాడారు. తాజాగా టెన్త్ ప్రశ్నపత్నం కుట్ర కేసులో విచారణాధికారిగా ఉన్న వరంగల్ సీపీపైనా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆయన సెటిల్మెంట్లు చేయలేదని ప్రమాణం చేయాలంటూ ఏకంగా ప్రెస్మీటే పెట్టారు.
‘నీతులు చెప్పేందుకే తప్ప.. పాటించేందుకు కాదు’ అన్నట్లుగా ఉన్నది బండి సంజయ్ వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం గానీ, సీఎం కేసీఆర్ కుటుంబం విషయంలో గానీ ప్రతీసారి ప్రమాణాలు చేయాలంటూ వ్యాఖ్యలు చేసే బండి సంజయ్… బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సవాల్కు మాత్రం తోకముడిచారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్రెడ్డి పాత్ర ఉన్నదని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీంతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసి తనకు ఆ కేసులో ఎలాంటి సంబంధం లేని ప్రకటించిన రోహిత్రెడ్డి.. బండి సంజయ్ కూడా వచ్చి అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ మాత్రం.. రోహిత్రెడ్డి సవాల్ను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తప్పు చేసేవారు సవాల్ విసిరితే తాను స్పందించనన్నారు. అంటే.. బీజేపీ నేతలు ప్రమాణాలు చేయమంటే ముఖ్యమంత్రి అయినా రావాలి కానీ.. ఇతర పార్టీల నేతలు సవాల్ చేస్తే మాత్రం బండి సంజయ్ పట్టించుకోరు.
రాష్ట్ర ప్రభుత్వం గానీ, సీఎం కేసీఆర్ కుటుంబం విషయంలో గానీ ప్రతీసారి ప్రమాణాలు చేయాలంటూ వ్యాఖ్యలు చేసే బండి సంజయ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సవాల్కు మాత్రం తోకముడిచారు.
‘నేను హిందువును. దేవున్ని నమ్ముతాను. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడే పూజారి నాకు అమ్మవారి కండువా కప్పారు. ఈ కండువా కప్పుకొని ఒట్టేసి చెప్తున్నాను. ఇది రాజకీయం కాదు. నా మనోవేదన. కేసీఆర్ నుంచి సాయం పొందితే మేం సర్వనాశనమవుతాం’
– రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్
మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బులను కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. తామెలాంటి డబ్బూ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమా ణం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు మద్దతుగా, వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ నేతలు ప్రమాణాల రాగం అందుకున్నారు. మునుగోడు విషయంలో ఆలయానికి వెళ్లిన రేవంత్రెడ్డి.. ఓటుకు నోటు కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా అంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ చురకలంటించారు. మరోవైపు రేవంత్కు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి… రూ.25 కోట్ల ఆరోపణలపై ఈటల భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్రెడ్డి ప్రమాణంపై స్పందించిన ఈటల రాజేందర్ ‘ఈ గుళ్లకు వెళ్లి అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏంటి? ఎవరేంటో ప్రజలకు తెలుసు. నిజమేంటో, అబద్ధమేంటో ప్రజలే తేలుస్తారు.’ అని వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ ప్రమాణంపై ఇలా మాట్లాడిన ఈటల.. బండి సంజయ్ ప్రమాణాల గురించి మాత్రం నోరు మెదపరు. ఎంతైనా సొంత పార్టీ నేత, పైగా పార్టీ అధ్యక్షుడు కదా. ఆయన గురించి మాట్లాడితే ఇంకేమైనా ఉందా? అం తేలే.. ప్రమాణాలు చేయాలన్నా.. చే యడానికి పిలుపునిచ్చినా.. అసలు ఈ ఓట్లు ఏంటి అని వ్యాఖ్యానించినా అది బీజేపీ నేతలకే చెల్లుతుంది.
గాజుల నాగార్జున: 9182777880