సమకాలీన తెలుగు కవుల్లో డాక్టర్ జే బాపురెడ్డి ప్రసిద్ధులు. నవ్యత, మానవత, ప్రసన్నత, బావుకత, తాత్వికత ఆయన కవితల్లో సజీవంగా దర్శనమిస్తాయి. వచన కవిత్వం రాజ్యమేలుతున్న నేటి కాలంలో ఆయన సాహసంతో పద్య ప్రక్రియను స్పృశించారు. అలు పెరుగని కవితా తృష్ణతో కడదాకా రచనలు చేశారు.
బాపు రెడ్డి 1936, జులై 21న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకాలోని సిరికొండలో రైతు కుటుంబంలో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా కవిత్వం రాశారు. అనేక గ్రంథాలు రచించారు. వీరు రచించిన ఋతురాగం గేయ నాటిక నంది అవార్డును కైవసం చేసుకున్నది. బాపు రెడ్డి గేయాలు, శ్రీకార శిఖరం, ప్రేమారామం, నా దేశం నవ్వుతుంది, బాపురెడ్డి భావ గీతాలు, ఆటపాటలు, నవగీత నాట్యం వంటి గేయ సంపుటా లు రచించారు. రంగు రంగుల చీకట్లు, ప్రణవ ప్రణయం, కాలం మాయాజాలం, సౌదామిని కవితలు, ఆత్మీయ రాగాలు, అక్షరానుభూతులు, వాడిపోని వసంతాలు, లోకానులోకనం వంటి కవిత్వ సంపుటాలు వెలువరించారు. ఇంగ్లీషులోనూ కొన్ని గ్రంథాలు రాశారు.
బాపు రెడ్డి గేయ నాటికలు రమణీయ భావ పేటికలు. ఆయన అనువాదాలు అనుభూతి పరాలు. తెలుగులో ఎంత హృద్యంగా కవితలు అల్లారో, అంతే హృద్యంగా నాలుగు ఆంగ్ల కృతులను రచించారు. వివిధ దృక్కోణాల్లో తన మనసులోని మాటలను సామాజిక సాహిత్య వ్యాసాలుగా తీర్చిదిద్ది ‘ఆధునిక తెలుగు కవిత తీరు తెన్నులను’ తెలుగు వారికి అందించి విమర్శకునిగానూ గుర్తింపు పొందారు. ఆయన ప్రతి రచనలోనూ, ప్రణయ, ప్రణవ, ప్రగతి భావాలు అంతర్వాహినిగా కనిపిస్తాయి. ప్రకృతి, పురుష యోగ తత్వం ప్రతిఫలించే ప్రణయ తత్త్వం మానవ జీవిత సత్యం కావాలని తన రచనల్లో ఆశించారు. వీరి ప్రగతి భావాలు నిర్మాణాత్మక నిర్ణయాత్మక ఫలితాలను సృష్టించాయి. అనంత సత్య గర్భితమైన చరాచర సృష్టిలో మానవ జీవితానికి ఉపయుక్తమయ్యే సామాజిక భావోద్దీపన వీరి ప్రగతి తత్త్వంలో దర్శనమిస్తుంది. సామాజిక వైరుధ్యాల పట్ల స్పందన అవశ్యమని తన ప్రగతి శీల భావాల్లో నిరూపించారు. తరతరాల ఏకతా భావాన్ని సమతా వేదికపై నిలపాలనీ, అప్పుడే సామాజిక అసమానతలు తొలగిపోయి మమత, మానవతలు పరిమళిస్తాయని ప్రగతి దృక్పథంతో భావించారు.
బాపు రెడ్డి ప్రణవనాదం ఆధ్యాత్మిక, తాత్త్విక భావాలను వినిపించింది. భక్తి, జ్ఞాన, కర్మ యోగ సాధనల ద్వారా అంతు లేని ప్రశాంతతను, పవిత్రతను పొంది ప్రజ్ఞానాన్ని సంపాదించి మోక్షము పొందవచ్చునని ప్రణవ దృష్టితో చెప్పారు. ఆయన ‘భావ భౌతికవాదం’ తెలుగులో సరికొత్త స్వేచ్ఛా వాదంగా నిలిచి సాహితీ విమర్శకులను సైతం ఆలోచింపజేస్తున్నది. భౌతికాన్ని భావంతో అనుసంధానించినప్పుడు అనుభూతమయ్యేది ఆనందమనే అనంత సత్యం. ఒక వస్తువులోని అనంత రూప గుణాలను విశ్వసించడం వల్ల నూతన విలువలు ఏర్పడతాయి. అవి మన ఆదర్శాలకు అనుగుణంగా ప్రతిఫలించాలని, దైవత్వం అనంత తత్వాలను ప్రకటితం చేయాలని తన వాదం ద్వారా అభిలషించారు. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో కొన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన తన గళాన్ని వినిపించారు. అలాంటి బాపు రెడ్డి ఇటీవల లోకాన్ని వీడి వెళ్లారు. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఆయన ఒక తారగా వెలుగుతూనే ఉంటారు.
డాక్టర్ చింతోజు,మల్లికార్జున చారి: 99499 27142