అవును. ‘ఆమె’విజ్ఞురాలు. నేనేదో తాత్వికంగానో, కాల్పనికంగానో ఈ మాటలు చెప్పడం లేదు సుమా.. మరణం వచ్చి తలుపు తడుతుందని కచ్చితంగా తెలిశాక కూడా ఎంతమంది ధైర్యంగా ఉంటారు? ఎప్పటికైనా మరణం తథ్యం. అయితే, అదెప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ, ఆమెకు మాత్రం తెలుసు. మృత్యుదేవత వచ్చి తలుపులు బాదీ బాదీ అలిసిపోకుండా ఉండేందుకు ముందుగానే తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికింది. రేపుంటామో లేదో తెలియదు కాబట్టి పనిలో పనిగా తన మరణానికి సంబంధించి ఓ కవితనూ రాసుకున్నది. తను పోయాక ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా రాసింది. ఓ రకంగా ఇది ఆమె ‘మరణ వాంగ్మూలం’ అనుకోవచ్చు. లేకుంటే తన మరణానంతరపు ‘వీలునామా’గా భావించవచ్చు.
నేను చెప్తున్న అక్షర విపంచి పేరు ‘బైరి ఇందిర’. ఇప్పుడామె లేదు. తుర్రుమని గాల్లో ఎగిరిపోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలియ దు కానీ, మొత్తానికి వెళ్లిపోయింది. ఆమె ఇప్పుడు లేదు. ఆమె జ్ఞాపకాలు మాత్రం ఆకుపచ్చగా అక్షరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ రోజు టీ సమయం ఇలా బరువుగా, బాధగా గడుస్తున్నందుకు నన్ను క్షమించండి. మరణానికి ముందుగానే బైరి ఇందిర రాసుకున్న ‘నేను పోయినప్పుడు’ కవిత చదవండి.
ఏదో ఒకరోజు అందరం పోయేవాళ్ళమే. కాకుంటే ఒకరు ముందూ, ఇంకొకరు వెనుక. ఇందిర మనల్ని విడిచి కాస్తా ముందుగా వెళ్ళిపోయారంతే. ఆమె ఎక్కడికి వెళ్ళారు? అందరూ వెళ్లే చోటికే. అది నరకమా, స్వర్గమా, లేక ఇంకేదైనానా తెలియదు. అసలు ఇవన్నీ ఉన్నవో లేవో ఎవరు చూశారు. పుట్టుట గిట్టుట కోసమే. అయితే అందరూ పుడతారు, అందరూ గిడతారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ, కొందరి పుట్టుక ఓ లక్ష్యం తో ముడిపడి ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేరగానే వారు వెళ్లిపోతారు. బైరి ఇందిర కూడా అంతే. ఆమె కవయిత్రి. అంతకు మించి ఓ మంచి ఉపాధ్యాయురాలు. సహృదయత, స్నేహం.. ఆమె సుగుణాలు. తనవంతుగా అన్నింటినీ అందరికీ పంచేసి ఆమె వెళ్లిపోయా రు. పోతూ.. పోతూ.. ఇదిగో అయినవాళ్ల కోసం తన వంతుగా ‘నేను పోయినప్పుడు’ అనే ఈ కవితను విడిచివెళ్లింది!
‘మరణం తన చివరి చరణం కాదు’ అన్నాడు అలిశెట్టి. బైరి ఇందిర కూడా అంతే.. ‘మరణం కేవలం భౌతికమైనద’ని చెప్పింది. ఇప్పుడామె మనతో లేకపోవచ్చు గానీ, ఆమె తాలూకు జ్ఞాపకాలు సాహిత్య రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఆమె సం స్కారం.. ఆమె వినయం.. ఆమె సౌశీల్యత.. ఆమె కవిత్వం.. ఇంకా.. ఇంకా.. ఆమె గుర్తులు ఎప్పుడూ పచ్చిగానే ఉంటాయి. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా.. ఇదిగో ఈ చివరి కవిత. ఇది చదివాక ఇందిర ఎక్కడికీ పోలేదు. ఆమె మనతోనే ఉన్నారు. అక్షరంతో మమేకమై ఉన్నారనిపిస్తున్నది.
‘తాను పోయినప్పుడు మీద ఏదిపడితే అది కప్పొద్దు.. ఓ కాగితాన్ని మాత్రం కప్పండి. అదైతే రాసుకోడానికి పనికొస్తుందన్నారు ఇందిర. తానున్నా,లేకున్నా అక్షరం తన తోడుండాలంటే రాసుకోడానికి కాగితం ఉండాలన్నది ఆమె కోరిక. సరే పోయాక అంతిమ సంస్కారాలు మామూలే. అయితే వాటికీ కొన్ని కండీషన్లు పెట్టారు ఇందిర. అంతిమ సంస్కారానికి ముందు అందరికీ మల్లే పసుపు గట్రా పూసి భయంకరంగా మార్చకండి. చిన్నపిల్లలు ఝడుసుకుంటారు పైగా తనను గుర్తుపట్టాలి కదా! అందుకే. తనను తన్నుగానే తీసుకెళ్ళమని, ఇందిరగానే గుర్తుపట్టేలా ఉంచమని, హంగామా ఏదీ చెయ్యొద్దని సుతిమెత్తగా తాకీదిచ్చారు.
అంతేనా? సంప్రదాయం అంటూ తనను మట్టిలో కప్పెట్టడమో? లేక కాల్చడమో చేస్తారేమో? ‘ప్లీజ్! మట్టిలో కప్పెట్టొద్దు, గాలాడక ఇబ్బంది పడతాను. అంతేకాదు. ఏవైనా పురుగూ పుట్రా ఉండొచ్చు. చికాకు పరుస్తాయి. పోనీ.. చితిలో తగలబెడతారేమో? కాస్త చూసి తగలబెట్టండి పక్కన మొక్కలుంటాయి. నా మూలంగా మంటల్లో కాలిపోతాయి.. జరభద్రం. వెనుకా ముం దూ చూడండి జర శోచాయించండి’ అంటూ జాగ్రత్తలు చెప్పారు. తనతో పాటు పెన్సిల్, రబ్బరు, కర్చీఫ్ బ్యాగులో ఉండేలా చూడమన్నది ఆమె అభ్యర్థన. ముఖ్యంగా సెల్ మర్చిపొయ్యేరు. బోర్ కొట్టి ‘చస్తాను’ అంటూ దుఃఖంలో కూడా హ్యూమర్ను జొప్పించి, అందర్నీ నవ్విస్తారు. నాకు ‘పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ’ అని పేర్లు పెట్టకండి. ‘కొత్త టైటిల్స్ ఏమీ ఇవ్వకండి. నాకు చిర్రెత్తుకొస్తుంది’ అన్నారు. అక్షరం ఎప్పుడూ గ్రేటే… గుండె తడి అద్దిన ఇలాంటి అక్షరాలైతే మరీ గ్రేట్. బైరి ఇందిరమ్మా! మీకు జోహార్లు. నా కన్నీటి నివాళులు.
ఎ.రజా హుస్సేన్ :90631 67117