తెలంగాణలో బాదామి చాళుక్యుల శాసనాలు దొరికిన ఒకే ఒక ప్రాంతం పాత మాహబూబ్నగర్ జిల్లా. ఆ జిల్లా శాసన చరిత్ర ప్రధానంగా బాదామి చాళుక్యుల శాసనాలతో మొదలవుతుంది. ఇప్పటి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల చరిత్ర ఈ శాసనాల్లో రికార్డయింది.
హైదరాబాద్ రాగి రేకు శాసనంగా పేరున్న రెండో పులకేశి శాసనం విశిష్ఠమైనది. 1870లలో బేగంబజార్లోని మహేంద్ర శాంతయ్య అనే జైన గురువు నుంచి ఈ రాగి రేకు నకలును జనరల్ ఫ్రేజర్ సంపాదించి డబ్ల్యు ఇలియట్, ఆ తర్వాత ఫ్లీట్ ఇండియన్ యాంటిక్వరీలో ప్రచురించడంతో రెండో పులకేశి గురించి ముఖ్య విషయాలు చరిత్రలో రికార్డయ్యాయి. వాతాపి నుంచి జారీ అయిన ఈ శాసనంలో రెండో పులకేశి క్రీ.శ.610లో సింహాసనం ఎక్కాడన్న సంగతి, ఆయన బిరుదులూ తెలుస్తున్నాయి. తగర నగర వాసి జ్యేష్ఠశర్మకు ఒక గ్రామం దానం చేసిన సంగతి కూడా ఉంది. ఈ తగర నగరం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న ఇప్పటి తేర్ పట్టణం. ఇది దక్కనులో బాదామి చాళుక్య రాజ్య విస్తృతిని తెలియజేస్తుంది.
రెండవ పులకేశి (క్రీ.శ. 610-642) జారీచేసిన ఇంకో శాసనం తుమ్మెయనూరు రాగి రేకుల సంస్కృత శాసనం. కార్తీక పౌర్ణమిన వచ్చిన చంద్రగ్రహణం రోజు సంగమేశ్వరుడి సన్నిధిలో మహబూబ్నగర్లోని తుమ్మెయనూరు గ్రామాన్ని ఆత్రేయ గోత్ర ఆపస్తంబ సూత్రానికి చెందిన మావు గణస్వామి అనే వ్యక్తికి దానం చేసినట్లు ఉంది. ఈ మావు గణస్వామి ఇందుపూరు ఘటిక (వైదిక పాఠశాల)కు చెందినవాడు. తుమ్మెయనూరు గ్రామం చాళుక్య విషయంలో (విషయం అంటే ఒక పాలనా ప్రాంతం), చింతేరు ఒడ్డున సంతనూరు, పులికురోపె అనే గ్రామాల మధ్య ఉంది.
ఆముదాలపాడు రాగి రేకుల శాసనంలో, క్రీ.శ. 660 వైశాఖ పౌర్ణమి రోజు మొదటి విక్రమాదిత్య మారూర గ్రామం దగ్గర బస చేసి శివమండల దీక్ష తీసుకుని, గురుదక్షిణగా సుదర్శనాచార్య అనే వ్యక్తికి ఈపరుంకల్ అనే గ్రామం దానం చేసినట్లు ఉంది. ఈ మారూర గ్రామం కొల్లాపూర్ దగ్గర కృష్ణ ఒడ్డున ఉన్న పెద్ద మారూర్, చిన్న మారూర్లుగా, ఈపరుంకల్ గ్రామం వీపనగండ్లగా గుర్తించినరు. గద్వాల తామ్రశాసనంగా పిలుచుకునే వెల్నల్లి శాసనంలో బహుశా మొదటి విక్రమాదిత్యుడి భార్య అయిన గంగా మహాదేవి కోరిక మేరకు కుండాశర్మ అనే వ్యక్తికి చేసిన భూదానం, అర్క బ్రహ్మ ఆలయ స్తంభంపైన పిష్ట శర్మ అనే వ్యక్తికి రాణి మహాదేవి చేసిన దానం
వివరాలు ఉన్నాయి.
పల్లెపాడు శాసనం దానంతో పాటు, పల్లవులపై చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యుడి విజయాన్ని చెపుతుంది. పానగల్లు ఇతడి విజయ స్కంధావారం (విజయం సాధించిన సైనిక శిబిరం)గా శాసనంలో ఉంది. అంటే తెలంగాణలోని కృష్ణా తీరంలోని అలంపూర్ వంటి పట్టణాలు, మత కేంద్రాలతోపాటు, చాళుక్యుల పరిపాలనా భాగాలుగా, సైనిక శిబిరాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ శాసనంలో చెప్పిన పనియల్ను పల్లెపాడుగా, బాణంకల్లును పానగల్లుగా, దానం ఇచ్చిన గ్రామం ధర్మపురను నేటి ధర్మవరంగా గుర్తించవచ్చు. పల్లెపాడు, ధర్మవరం జోగులాంబ గద్వాల జిల్లాలో, పానగల్లు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. అలంపురం బాలబ్రహ్మేశ్వర ఆలయ మండప స్తంభం మీద ఉన్న సంస్కృత శాసనంలో విజయాదిత్యుని ప్రశస్తి ఉంది.
అలంపూర్ పాపనాశన ఆలయ ద్వార శాఖపై ఉన్న క్రీ. శ. 7-8 శతాబ్దాల నాటి ఒక చిన్న శాసనం కొంత ఆసక్తి కలిగించేదే. మైసూరు దగ్గర ఉన్న తలకాడుకు చెందిన గోసాసి, చాతుర్మాసి అయిన ఇరుగయ్యణ అనే వ్యక్తి ప్రస్తావన దీంట్లో ఉంది. గోసాసి అంటే మక్ఖలి గోసల మతమైన అజీవక మతానికి చెందిన వ్యక్తా అన్నది ఆలోచించాలి. అజీవకుల్లో ఒక శాఖ జైనుల్లో కలిసి పోయింది. తలకాడు ప్రాంతంలో ఆ కాలంలో జైన మత ప్రభావం ఉండేది. ఇక ‘చాతుర్మాస’ అనే పదం కూడా పరివ్రాజక మతాలైన బౌద్ధ, జైన, అజీవకులకు వర్తిస్తుంది. ఇది స్పష్టమైతే క్రీ. శ. 7, 8 శతాబ్దాల్లో దక్షిణాన అజీవక మత ఉనికికి ఇంకో ఆధారం దొరుకుతుంది. దీనిని బట్టి చూస్తే అలంపూర్ తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో ఒక ముఖ్య కేంద్రంగా ఉండిందని తెలుస్తుంది.
మొదటి అనివరిత విక్రమాదిత్య అలంపూర్ శాసనం, విజయాదిత్య శాసనాలు రెండు అలంపూర్లో, అచ్చంపేట మండలం లక్ష్మాపూర్లో, అలంపూర్ చండిక ఆలయం దగ్గర లఘు శాసనం ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’, అలంపూర్ చండిక ఆలయం దగ్గర లఘు శాసనం శ్రీ వారీశ్వర మునుళుచ కొత్త నివాసి, అలంపూర్ మ్యూజియంలో స్తంభంపై రెండు శాసనాలు తెలంగాణలో దొరికిన బాదామి చాళుక్య శాసనాలు. ఇవన్నీ కన్నడ, తెలుగు-కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. బ్రాహ్మణులకు చేసిన దానాలు, బ్రాహ్మణుల గోత్రాలు, ఘటికల ప్రస్తావన, శివమండల దీక్షలు – ఇలా ఈ శాసనాలన్నీ బాదామి చాళుక్యుల కాలంలో పెరుగుతున్న వైదిక మత ప్రాభవం, అందులో శైవ మత వ్యాప్తి కనిపిస్తుంది. సూర్య, చంద్ర గ్రహణాల రోజున ఎన్నో దానాలు చేస్తున్న విషయాన్ని సూచిస్తున్నాయి.
వాతాపి కథ
తల్లులు పిల్లలకు పాలిచ్చి లేక గోరుముద్దలు పెట్టిన తర్వాత ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనడం వెనుక గమ్మత్తయిన కథ ఉంది. ఈ కథ మనకు ఎందుకు అవసరం అంటే చాళుక్యుల రాజధాని బాదామి అసలు పేరు వాతాపి. ఈ కథ ప్రకారం.. ఇల్వల, వాతాపి అనే ఇద్దరు అన్నదమ్ములైన రాక్షసులు ఇక్కడ ఉండేవారు. వాతాపి ఏదైనా జంతు రూపం ధరిస్తే, అన్న ఇల్వల ఆ జంతువును చంపి, వండి దారినపోయే బాటసారులకు పెట్టేవాడు. అతిథి తినడం అయిపోగానే ఇల్వల, ‘వాతాపీ బయటకురా’అని పిలిచేవాడు. అతిథి పొట్టను చీల్చుకుని వాతాపి బయటకు రావటంతో ఆ అతిథి మరణించేవాడు. అన్నదమ్ములిద్దరు ఆ బాటసారిని తినేసేవాళ్ళు. ఒకరోజు అగస్త్యముని ఆ దారిలో పోతుంటే వీరు ఎప్పటిలాగే పిలిచి భోజనం పెట్టినారు. అయితే ఇల్వల తమ్ముడిని పిలిచే ముందే, అగస్త్యుడు ’జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనడంతో వాతాపి జీర్ణమైపోయి, రాక్షసుల అంతం జరిగింది. ఇదీ వాతాపి కథ. ఇది పుక్కిటి పురాణమే. దీని వెనుక ఉన్న అసలు కథ.. దక్కనులో వైదిక సంస్కృతి లేక ఆర్యీకరణం జరిగిన విషయాన్ని చెప్పే myth ఇది. ముత్తుస్వామి దీక్షితార్ రాసిన ‘వాతాపి గణపతిం భజే’లో వాతాపి గణపతి విగ్రహం.. రెండవ పులకేశిని ఓడించిన తర్వాత పల్లవులు వాతాపి నుంచి తమిళనాడుకు తీసుకుపోయిన వాతాపి గణపతి విగ్రహం గురించిన స్తుతి.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000