‘బాలగంగాధర్ తిలక్ కనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనేవాడు కాదు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు’ అని నినాదించేవాడంటారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో అనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత బడుగు, బలహీనవర్గాలను హీన స్థితికి దిగజార్చాయి. అలాంటి వివక్షాపూరిత సమాజంలో సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు అంబేద్కర్.
అంబేద్కర్ రాకతో సామాజిక అసమానతలపై దిగువ కులాల పోరాట ఉద్యమాలు ప్రాంతీయ పరిధిని దాటి జాతీయస్థాయి ఉద్యమాలుగా రూపాంతరం చెందాయి. ‘బోధించు, సమీకరించు, పోరా డు’ అనే నినాదంతో దళిత జాతిని సంఘటితం చేశాయి. దళిత జాతులను పీడిస్తున్న అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాసిక్లో అంబేద్కర్ చేసిన మహాద్ చెరువు పోరాటం అందరి దృష్టిని ఆకర్షించించింది. ఆలయాల ప్రవేశాలు, పాఠశాలల్లో చదువు, తాగునీరు బలహీన వర్గాలకు అందాలని పట్టుపట్టారు. అంబేద్కర్ ‘అఖిల భారత దిగువ కులాల సమాఖ్య’ను స్థాపించి వారి ఉన్నతికోసం పోరాడారు. ఇంగ్లాండులో మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అంబేద్కర్ దళిత జాతి సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్లారు. దళితజాతులు సమాజంలో విస్మరించబడ్డాయని గుర్తించి వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని డిమాండ్ చేశారు. అప్పట్లో అది ఆచరణలో సాధ్యం కానప్పటికీ నేటి రిజర్వేషన్ వ్యవస్థకు మూలమైంది.
అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే వారి సమస్యలకు పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించారు. అందుకే వీరికి రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను కల్పించారు. రాజ్యాంగ రచన కమిటీలో అత్యంత అర్హత కలిగిన వ్యక్తిగా ఆ కమిటీకి అధ్యక్షత వహించారు. దేశంలో ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వంకోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. స్వాతంత్య్రానంతరం నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కు కోసం పోరాడారు. ఈ విధంగా ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్పృశించారు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖమంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో హిందూ కోడ్ బిల్లు విషయమై రాజీనామా చేశారు.
భారతీయ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్ష పేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్. ఆయన నిత్య చైతన్యం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన జయంతిని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. ఇది భారత ప్రజలందరికీ గర్వకారణం. తెలంగాణ తొలి ప్రభుత్వం హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి ఆయన పేరును పెట్టడం గొప్ప విషయం. ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా చాటుతూ ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషిచేయాలి. అంబేద్కర్ పట్ల సంకుచిత భావజాలాన్ని విడనాడి మానవ హక్కుల నేతగా గుర్తించాలి. ఇదే ఆయనకిచ్చే ఘనమైన నివాళి.
-ఎస్. శ్యామల
80085 39905