కాకతి సామ్రాజ్య వైభవాన్ని నలుదిశలకు వ్యాపింపచేసినవారిలో గణపతిదేవ చక్రవర్తి అగ్రగణ్యుడు. పుత్ర సంతతి లేకున్నా కూతురు రుద్రమదేవిని మగసంతానంగానే పెంచినాడు. అంతటి అభ్యుదయ భావాలు కలిగిన గణపతిదేవుని కాలంలో అనేక కట్టడాలు, చెరువులు నిర్మించబడినాయి. అవన్నీ శాసనస్థం చేయబడినాయి. అలాంటి శాసనాల్లో ఒకటి పాకాల శాసనం. 235 పంక్తులున్న ఈ శాసనంలో శాసన కాలం పేర్కొనలేదు
శాసనం వేయించినవాడు జగదల ముమ్మడయ్య. ఇతని తండ్రి మంత్రి బయ్యన, తల్లి బాచాంబ. ఇతని అన్నలు గణపతి, నల్ల గణపతి. గణపతిపురంలో శివరామనాథ దేవాలయానికి దగ్గరలో మౌద్గ ల్య తీర్థమనే అద్భుతమైన చెరువును నిర్మించినాడు. శాసనంలో మౌద్గల్యతీర్థం, అక్కడి దైవమైన భైరవుడు, గణప పురాన్ని గూర్చిన వర్ణన ఉన్నది. ఈ శాసన రచయిత కవి చక్రవర్తికి 5 మర్తుర్ల భూమిని సమర్పించాడు.
శాసనంలో కాకతీయ వంశ వృక్షానికి చెంది న వివరణ రెండు విధాలుగా ఉన్నది. ఒకటి పురాణాల ప్రకారం, రెండవది చారిత్రకపరంగా. పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో దశరథుడు, రాముడు, కరి కాలుడు, దుర్జయు డుగా పేర్కొన్నారు. అదే చారిత్రకంగా 1వ ప్రోలుడు, అతని కొడుకులు రుద్రుడు, మహాదేవుడు, మహాదేవుని కొడుకు గణపతి దేవుడు. ఇతడు చాలా శక్తిశాలి. ఇతని ఆస్థానంలో
‘కాశీనాథ: కళింగ: శక ధరణిపతి ర్మాళవ: కేరళేశ:
తోమాణో హూణభూప: కురపతి రరిమర్దాధిపోమాగ ధేశ:
నేపాళ శ్చోళ పృధ్వీపతిరితి వినతా నగ్రతో రాజవర్గాన్
నామగ్రాహం గృహీత్వా సదసి సదసి యద్దర్శకా దర్శయంతి’
కాశి, కళింగ, శక, మాళవ, కేరళ, తుమ్మన, హూణ, కుషా, అరిమర్ద మగధ, నేపాల, చోళ దేశాధీశులకు గణపతిదేవుని రాజసభలో వారి వారి స్థానాలు చూపించారు. అయి తే ఇంతమంది రాజులు గణపతిదేవుని ఆస్థానాన్ని సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు లేవు. గణపతిదేవుని శౌర్య ప్రతాపాలను వర్ణిస్తూ గణపతి దేవుని చేతిలో ఓడిపోయిన శత్రురాజులు భార్యలతో సహా ద్వీపాంతరాలకు వ్యాపారుల పడవల్లో రహస్యంగా పారిపోతూ మాట్లాడుకుంటున్నారట. శత్రురాజు ప్రియురాళ్ళ ముఖాలు చంద్రబింబంగా భ్రమించి, సము ద్రం ఉప్పొంగి, తమ ఓడను పగల గొట్టగలదన్న భయంతో వారు ముఖాలను కప్పుకోమని చెప్పినారట. కాకతీయుల వర్ణన సుదీర్ఘంగా ఉన్న శాసనాల్లో ఇది ఒకటి.
-బిన్నూరి మనోహరి