భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అంబేద్కర్కు ముందు అంబేద్కర్ తర్వాత అని చెప్పుకోకతప్పదు. ఎందుకంటే, ఎన్నో ఏండ్లుగా మన దేశంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలను, వివక్షలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడాయన. అందరూ సమానమనే భావనను కలిగిస్తూ, ఎవరూ చెరిపివేయలేని శాసనాన్ని రాజ్యాంగం రూపంలో లిఖించారు అంబేద్కర్. ఈ దేశాన్ని భూమిపుత్రులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు పాలించాలని.. తద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో కూడిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన వస్తుందని భావించిన అంబేద్కర్ దాని కోసం ఎంతగానో శ్రమించారు.
అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, స్కాలర్షిప్లు కాదు. అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు, వాటి ద్వారా ఉద్యోగాలు పొందడం కాదు. అంబేద్కర్ అంటే చైతన్య దీప్తి. 21వ శతాబ్దంలో పుట్టిన గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. తన విగ్రహాలు ప్రతిష్ఠించాలని, జయంతి, వర్ధంతిల పేరిట స్వీట్లు పంచాలని, వ్యక్తి పూజ చేయాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. బహుజనులు, అణగారిన వర్గాల బతుకులు మారాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం నిరంతరం కృషి చేశారు. అంబేద్కర్ ఆశయాన్ని సాధించాలన్నా, బడుగుల బతుకులు మారాలన్నా.. నిమ్న కులాలవారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. కులవృత్తులు చేసుకుంటూ పొట్ట పోసుకోవడం కాదు, రాజకీయమే కులవృత్తిగా మార్చుకోవాలి. రాజ్యాంగం మనకు ఓటు హక్కు ప్రసాదించింది.. ఓటు వేయడానికి కాదు, బలహీనవర్గాల రాజ్యం స్థాపించడానికి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన అంబేద్కర్.. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలను స్థాపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చారు. రాజ్యాధికారం ప్రాముఖ్యతను వివరించారు.
మన దేశంలో సాంస్కృతిక పరివర్తనతో కూడిన సామాజిక, రాజకీయ విప్లవం తీసుకురావాలని అంబేద్కర్ మొదట్నుంచి ఆకాంక్షించారు. అయితే నాటి పరిస్థితుల దృష్ట్యా సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే అణగారిన, వెనుకబడిన వర్గాలకు, స్త్రీలకు రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు. తాను రాసిన రాజ్యాంగమే భవిష్యత్తులో మానసిక, భౌతిక పరివర్తనతో కూడిన విప్లవాన్ని తీసుకొస్తుందని భావించిన ఆయన రాజ్యాధికారమే మాస్టర్ కీ (Political power is the master key by which you can open each and every lock) అని అన్నారు.
రాజ్యాధికారంతో ఎలాంటి మార్పునైనా తీసుకురావచ్చనే అంబేద్కర్ సూత్రాన్ని ఆచరణలోకి తెచ్చింది మాత్రం కాన్షీరాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంబేద్కరిజాన్ని నిబద్ధతతో అమలు చేసిన కాన్షీరాం ఫలితం సాధించారు. రాజకీయేతర ఉద్యమం లేకుండా రాజకీయ పార్టీని నడపటం అసాధ్యమని.. సాంస్కృతిక, రాజకీయ పరివర్తన తీసుకురావడం కష్టసాధ్యమని భావించిన కాన్షీరాం అంబేద్కర్ కోరుకున్న విధంగా ఒకే సమయంలో సాంస్కృతిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించారు. బడుగుల జీవితాలను మార్చారు.
అంబేద్కర్ తర్వాత ఆయన ఆశయాలను కాన్షీరాం కొనసాగించినట్టే.. నిమ్న కులాల కోసం ఎవరో ఒకరు పోరాటం చేస్తూనే ఉంటారు. ఎక్కడో ఒకచోట అగ్గిరాజుకుంటూనే ఉంటుంది. అణగారిన వర్గాల హక్కులకు ఆటంకం కలుగుతున్న ప్రస్తుత తరుణంలో, పాలకులు స్వేచ్ఛను హరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ అంబేద్కర్గా మారాలి. గొంతెత్తి నినదించాలి. దళితుల హక్కుల కోసం ఉద్యమమై ఎలుగెత్తాలి.
– పుల్లెంల గణేష్ 95530 41549