మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తున్న ప్రజలపై సైనిక పాలకులు అణిచివేత చర్యలకు పాల్పడుతున్న తీరు గర్హనీయం. ప్రజలపై ఏకపక్షంగా కాల్పులు జరపడం, ఉద్యమకారులను అదృశ్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. శత్రుస్థావరాలపై దాడి చేసినట్టుగా నగరాలపై బాంబులు కురిపించడం ఆక్షేపణీయం. మయన్మార్లో సైనిక పాలన మొదలై రెండు నెలలు దాటింది. ఈ స్వల్ప కాలంలోనే సైన్యం దాడులకు వందల మంది బలయ్యారు. అసలు సైనిక ప్రభుత్వానికి పాలించే అధికారమే ఉండదు. ప్రభుత్వం ఏదేమైనప్పటికీ, ప్రజా ఉద్యమం తీవ్రంగా ఉంటే చర్చలు జరిపి ఏదో ఒక స్థాయిలో అంగీకారానికి రావాల్సిందే. ప్రజల డిమాండ్లు నెరవేర్చాల్సిందే తప్ప దమననీతి తగదు.
1948లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినప్పటికీ మయన్మార్ 2011 దాకా సైనిక పాలనలో మగ్గింది. ఈ కాలమంతా ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. అణిచివేతతో ఇంకెంతో కాలం తమ పాలన కొనసాగదని భావించిన సైనిక పాలకులు తమ చెప్పుచేతల్లో ఉండే యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎన్డీపీ)ని స్థాపించారు. పరోక్షంగా పాలనను తమ చేతుల్లో ఉంచుకోవటానికి ఎత్తులు వేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అఖండ విజయం సాధించింది. సైన్యం అండదండలున్న యూఎన్డీపీని ప్రజలు మట్టి కరిపించారు. అధికారం రుచి మరిగిన సైన్యం ప్రజాస్వామ్య పాలనను సహించలేక పోయింది. ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ సాకు చూపి అధికారాన్ని చేజిక్కించుకున్నది. కొన్ని లోపాలున్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు.
మయన్మార్తో భారత్కు 1600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉన్నది. ఆ దేశంలో సంక్షభం కారణంగా మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాలు వలస తాకిడిని ఎదుర్కొంటున్నాయి. ఒక్క మణిపూర్లోనే వేలల్లో శరణా ర్థులున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉండటం విశేషం. పొరుగు దేశంగా వలస సమస్యను ఎదుర్కొంటున్నందున మయన్మార్లో శాంతియుత, సుస్థిర పరిస్థితులు నెలకొనాలని భారత్ ఆశించడం సహజం. ప్రజాస్వామ్య దేశంగా ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా భారత్కు ఉన్నది. మయన్మార్ ఉద్యమానికి మద్దతుగా మన దేశం అంతర్జాతీయంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతు నిచ్చి, మయన్మార్ సైనిక పాలకులపై ఒత్తిడి తేవాలి.