సువిశాల కాకతి సామ్రాజ్యాన్ని గణపతిదేవుని తర్వాత అతని పుత్రిక రుద్రమదేవి పరిపాలించింది. ఆమె అసమాన శౌర్యప్రతాపాలతో చిన్నతనం నుంచి రాజ్యభారం వహించి శత్రురాజులను అణచివేసింది. తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ, కాకతి రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించింది. ఆమె వివాహము చాళుక్య వీరభద్రునితో జరిగింది. రుద్రమ భర్త వీరభద్రుడన్న విషయం కొలనుపాక శాసనం ద్వారా స్పష్టమవుతున్నది.
క్రీ.శ.1280 నాటి- కొలనుపాకలోని సోమనాథాలయంలో ఉన్న శాసనం ప్రమాది సంవత్సరం పుష్య బహుళ సప్తమినాడు కాకతి రుద్రమ పాలనా సమయంలో చాళుక్య ఇందుశేఖరుడు వేయించినది. పూర్తి సంస్కృత భాషలో ఉన్న ఈ శాసనంలో కాకతి వంశ వర్ణన, చాళుక్య వంశ వర్ణన చేయబడింది. మహా పరాక్రమశాలి అయిన ఇందుశేఖరుని సేవకుడైన పోతినాయకుడు కొలిపాక స్థలంలో ఒక అందమైన ‘వంశవర్ధనం’ అనే కాలువను తవ్వించాడు. ఈ కొలిపాకలో కాకతీయ రాజులకు విధేయులు, కవిజన ప్రియులు, యోధులు ఉన్నారు. సోమనాథుని పాద పద్మారాధకులై ఉన్నారు. వీరందరూ అమాత్యులతో కలిసి ఇందుశేఖర ప్రభువును కలిసి నప్పుడు శాసనంలో వివరించబడిన దానం చేయడానికి అనుమతించెను. ఈ ఇందుశేఖరుడు చాళుక్య వీరభద్రుని అన్న కుమారుడుగా కొంతమంది, కుమారునిగా కొంతమంది చెప్తారు. చాళుక్య వంశానికి మణివంటివాడైన ఇందుశేఖరుడు సోమనాథ దేవుని నిత్యపూజలకు ముప్పై నివర్తనాల భూమిని దానం చేసినట్లు శాసనంలో తెలుపబడింది.
శాసనంలో కాకతీయ గణపతిదేవునికి- సర్వ రాజన్య కిరీట రత్నాలతో నివాళులు అందుకొనే పాదాలు కలదిగా, దశదిశల్లో తన కీర్తి వ్యాపించేదిగా, ధనంలో కుబేరునిగా, బలంలో అర్జునుడిని మించినదిగా, లక్ష్మీదేవిలాగా.. వీరందరి లక్షణాలతో రుద్రమదేవి జన్మించినదట. అట్లా జనించిన రుద్రమకు సౌందర్యంలో చంద్రుడు, ప్రతాపంలో సూర్యుడిని మించిన వీరభద్రుడు పతిగా లభించాడు. అతని పాండిత్యం విద్వాంసులకు, దాతృత్వం అర్థులకు, ఆజ్ఞాగుణం సామంతులకు, శౌర్యం శత్రురాజులకు మాత్రమే తెలుస్తుంది కాని ఇతరులకు తెలియదు అని అతని గుణాలను వివరించడం జరిగింది.
చాళుక్య ఇందుశేఖరుడు కూడా యువరాజుగా అందరినీ సంతుష్టులను చేస్తూ అధికారం అందుకొన్నప్పుడు తన వితరణగుణం చేత పండితులను, రణముల చేత శత్రువులను సంతృప్తిపరిచాడట. అతని సేవకుడైన పోతినాయకుడు ఈ శాసనంలో- నిర్మలుడు, నిర్భయుడు, శత్రుముఖ కమలములకు చంద్రుని వంటివాడు, వైరి మదవారణ కుంభస్థలాలను చీల్చటం చేత మూడు లోకాల్లో తన కీర్తిని వెల్లివిరియజేయు లతా సముదాయం కలవాడుగా పేర్కొనబడ్డాడు.శాసనం ప్రారంభంలో వరాహమూర్తి, గణపతి, చంద్రుడు స్తుతించబడినారు. కాకతి రుద్రమ భర్త చాళుక్య వీరభద్రుడు, అతని వంశీకుల వర్ణనతో కూడిన శాసనం కొలనుపాకలో లభించడం విశేషం.
– డాక్టర్ భిన్నూరి మనోహరి , 9347971177