బహుళత్వం, లౌకికత్వం, సమాఖ్యతత్వం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతూ, అబద్ధాల ప్రచారంతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడిక ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులోనూ ఆంక్షలను విధించడం తీవ్ర ఆక్షేపణీయం. ‘అవినీతి, సిగ్గుచేటు, నియంత, తమాషా, నేరస్థుడు, గూండాయిజం, కపటత్వం, అసమర్థత, ద్రోహం, విచ్ఛిన్నకరశక్తులు, అరాచకం, లైంగిక వేధింపులు, శకుని’ వంటి పదాలను పార్లమెంటులో వాడకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవేవీ మోటు పదాలు కావు, సభ్యతకు భంగకరమైనవీ కాదు. ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేసే అవకాశమే లేకపోతే ఇక పార్లమెంటులో చర్చలెలా సాగుతాయి. పార్లమెంటు సమావేశాల నిర్వహణే ప్రహసనంగా మారదా?
పార్లమెంటు ఆవరణలో శాంతియుత ధర్నాలు, ప్రదర్శనలు జరుపకూడదని, సభలో ప్లకార్డులను ప్రదర్శించకూడదని కూడా ఆంక్షలు విధించడం మరీ విడ్డూరం! శాంతియుత నిరసనకు ప్రపంచ ప్రఖ్యాత ప్రతీకగా నిలిచిన గాంధీ మహాత్ముడి విగ్రహం దగ్గర ప్రజా ప్రతినిధులే నిరసనలు వ్యక్తం చేయకూడదంటే ఇంక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది! గాంధీ, వల్లభాయి పటేల్ మొదలైన వారి పేర్లను ప్రచారానికి ఉపయోగించుకునే బీజేపీ పెద్దలకు వారు జీవిత పర్యాయం పాటించిన విలువలు మాత్రం ఒంటపట్టడం లేదు. చర్చలు, విమర్శలు, శాంతియుత నిరసనలు లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యంగా ఎట్లా చెప్పుకోగలం? పార్లమెంటులో అనేక బిల్లులను చర్చ లేకుండా ఆమోదింపచేసిన మోదీ సర్కారు ఇప్పుడు కనీసం మాటలు కూడా వాడకుండా కట్టడి చేస్తున్నది.
వ్యవసాయ బిల్లులపై పార్లమెంటులో కూలంకషంగా చర్చించినట్టయితే, ఆ తరువాత ఏడాది పాటు రైతులు ప్రదర్శనలు చేసి, ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకునే పరిస్థితి ఏర్పడేదా? భావవ్యక్తీకరణకు వేదికగా పార్లమెంటు ఉండకపోతే, ప్రజలు వీధుల్లో తేల్చుకుంటారనడానికి ఇదొక ఉదాహరణ. పార్లమెంటరీ పద్ధతుల్లో తమ ఆవేదన వ్యక్తం చేసుకోవచ్చనే నమ్మకం సడలినప్పుడే ఆందోళనలు సాగుతాయి. ‘అగ్నిపథ్’ విధానంపై హింసాయుత నిరసనలు భగ్గుమనడమే ఇందుకు సూచన. పార్లమెంటు సభ్యులంటే ప్రజాప్రతినిధులు. వారు ప్రజల మనోభావాలను చట్టసభల్లో వ్యక్తీకరిస్తారు. ఒక్కోసారి ఈ చర్చలు, ఆందోళనలు పెడదారి పడుతుండవచ్చు. కానీ ముక్కు మీద ఈగ వాలిందని ముక్కును కోసేసుకుంటామా? చర్చలకు, విమర్శలకు, నిరసనలకు తావు లేకుండా చేయడమే ‘మోదీ మార్కు ప్రజాస్వామ్యం’గా కనిపిస్తున్నది. మోదీ సర్కారు పార్లమెంటులో ఆంక్షల దగ్గరే ఆగిపోదు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదం మోపుతుందనడానికి ఇది సంకేతం. ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు కలిసికట్టుగా ఈ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలి.