‘ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అని భారతీయ సంస్కృతి భావిస్తుంది. వసుధైక కుటుంబమే మా అభిమతం’ అని ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఘనంగా చెబుతారు. ప్రపంచం సంగతి అటుంచి భారతదేశం మొత్తాన్నైనా ఒక కుటుంబంగా మోదీ భావిస్తారా అన్నది అనుమానమే. విపక్ష పాలిత రాష్ర్టాలపై కేంద్రం, బీజేపీ చూపుతున్న వివక్షే ఇందుకు నిదర్శనం. అందునా తెలంగాణపై మోదీ సర్కారు కక్ష గట్టినట్లే వ్యవహరిస్తున్నది. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తానన్న హామీ మా పరిశీలనలో లేదు. పసుపుబోర్డు నెలకొల్పుతామన్న ప్రతిపాదన అసలే లేదు. మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టు లాభదాయకం కాదు, మంజూరు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ఎంపీలకు కేంద్రం ఇటీవల ఇచ్చిన సమాధానాలివి. ఇదేదో కొత్త ధోరణి కాదు. మోదీ అధికారంలోకి వచ్చిన 2014లోనే తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకూ కేంద్రం వైఖరి ఇదే.
తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను, ముక్కోటి తెలంగాణ వాసుల ఆకాంక్షను మోదీ ఒక్క వ్యాఖ్యతో అవమానించారు. ఉమ్మడి ఏపీతో తెలంగాణకు ఉన్నది తల్లీబిడ్డల సంబంధమా? ఏ బిడ్డనైనా తల్లి కడుపు మాడ్చి తను పంచభక్ష్య పరమాన్నం తింటుందా? ఉమ్మడి ఏపీ తల్లి లాగా చూసుకుంటే తెలంగాణ ఎందుకు తిరగబడింది?.. మోదీ మాటల్లో వ్యక్తమైంది చరిత్ర తెలియని అజ్ఞానమే. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే, తెలంగాణ నుంచి ఏడు మండలాలను గుంజుకొని ఏపీలో కలుపాలని నిర్ణయించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత హైదరాబాద్కు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు మోకాలడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు మంగళం పాడింది కేంద్రం. కృష్ణా జలాల్లో వాటా తేల్చమంటే తొమ్మిదేండ్లుగా నాన్చుడు వైఖరే. మీది నుంచి కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల పేరుతో లేని పెత్తనం!
కేంద్రం వైఖరి ఇంత దారుణంగా ఉన్నా సొంత వనరులతో, తనదైన దార్శనికతతో తెలంగాణను గట్టెక్కించారు ముఖ్యమంత్రి కేసీఆర్. విద్యుత్, సాగు, అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు, ఐటీ, పరిశ్రమలు, సంక్షేమం వంటి పలు రంగాల్లో వినూత్న విధానాలను తీసుకొచ్చి, రాష్ర్టాన్ని తొమ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలో దేశానికే ఆదర్శంగా నిలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి తెలంగాణ పథకాలను వేనోళ్ల పొగిడాయి. వాటికి నిధులివ్వాలని స్వయంగా కేంద్ర సంస్థలే సిఫారసు చేశాయి. కానీ, మోదీ ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోగా, తెలంగాణకు అప్పులు కూడా పుట్టకుండా పరిమితులు, ఆంక్షలు విధించింది. పండిన ధాన్యాన్ని కొనే విషయంలోనూ మొండిచేయి చూపింది. నూకలు తినాలంటూ అవమానించింది. ప్రజలంటే ఓట్లు వేసే యంత్రాలని, విద్వేషాల చిచ్చు పెట్టి వారి నుంచి ఓట్లను రాబట్టుకోవచ్చని భావించే వాళ్ల నుంచి రాజధర్మాన్ని ఆశించటం అడియాసే అవుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని బీజేపీ పాలకులు గుర్తించాలి. లేదంటే అది వారికి తప్పక గుణపాఠం నేర్పుతుంది.