ఈశాన్యాన ప్రకృతి అందాలకు నెలవైన మణిపూర్ భగ్గుమనటం కలకలం రేపింది. ఇది పైకి జాతి వైరంగా కనిపిస్తున్నా.. కొండప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు మధ్య నెలకొన్న అగాధానికి మరో నిదర్శనం. కొండప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రకృతిలో పుట్టి పెరిగి అక్కడే కలిసిపోయే అడవి బిడ్డలు. వారికి మైదానాల్లోని సంప్రదాయాలు, చట్టాలు, నిబంధనలు తెలియవు. కానీ, మైదాన ప్రాంతాల ప్రజలు కొండప్రాంతాల్లోకి వెళ్లి అక్కడి భూములపై, సంస్కృతిపై, ప్రజలపై అజమాయిషీ చేయటం ప్రారంభించినప్పుడే ఘర్షణ మొదలవుతుంది. ఇది మన వద్దే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపించేదే. మణిపూర్ సంక్షోభమూ ఇటువంటిదే. ఆ రాష్ట్ర భూభాగంలో 90 శాతం కొండప్రాంతాలే. ఇక్కడ ప్రధానంగా కుకి, నాగా తదితర తెగలకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. భూభాగంలో 10 శాతం ఉన్న మైదానప్రాంతంలో మెయితీలుగా పేరొందిన ప్రజలు ఉంటున్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న మెయితీలదే రాజకీయంతోపాటు అన్ని రంగాల్లో ఆధిపత్యం. వారు కొండప్రాంతాల్లోకి కూడా విస్తరించారు.
కుకి, నాగా తెగల వాసులకు ఎస్టీ హోదా ఉంది. ఈ మేరకు కొండప్రాంతాల్లో ఆదివాసీలు తప్ప ఇతరులు భూములు కొనటానికి వీల్లేదు. ఒక రకంగా వారి ఉనికికి ఆదరవుగా నిలుస్తున్న హోదా ఇది. కొంతకాలంగా, తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలంటూ మెయితీలు ఉద్యమిస్తున్నారు. వారికి ఆ హోదా ఇస్తే తమ ప్రాంతాలు పూర్తిగా మెయితీల గుప్పిట్లోకి వెళ్తాయని, ఇవ్వటానికి వీల్లేదని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం చాలాకాలంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో 2017లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ముదిరింది. కొండప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి గ్రామాలపై ప్రభుత్వ దాడులు పెరిగాయి. అంతేగాక, కొండప్రాంతాల్లోని అనేక ఏరియాలను అభయారణ్యాలుగా, రక్షిత అటవీ ప్రాంతాలుగా ప్రకటించి అక్కడున్న ఆదివాసీలను ఖాళీ చేయించటం మొదలైంది. దీనిపై ఆదివాసీ తెగలు ముఖ్యంగా విద్యార్థులు నిరసన బాట పట్టారు. ఈ వివాదానికి మతపరమైన కోణం కూడా ఉంది. మెయితీలు హిందువులు కాగా, ఆదివాసీల్లో అత్యధికులు క్రైస్తవులు.
మెయితీలకు ఎస్టీ హోదా ఇచ్చే దిశగా రాష్ట్ర హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల తీర్పునివ్వటంతో వివాదం ఒక్కసారిగా భగ్గుమన్నది. ఎస్టీ జాబితాలో ఒక వర్గాన్ని చేర్చే, తొలగించే అధికారం రాష్ట్రపతికి తప్ప ఏ కోర్టుకూ, ప్రభుత్వానికీ లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది. ఈ విషయం మణిపూర్ హైకోర్టు దృష్టికి ఎందుకు రాలేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నది. కానీ, ఎన్నో కుటుంబాలలో ఆ అల్లర్లు విషాదం నింపాయి. కర్ణాటక ఎన్నికలపై దేశమంతా ఆసక్తి చూపుతున్న వేళ.. ఈశాన్యాన మంటలు చెలరేగాయి. అక్కడ చిచ్చు రేపి ఇక్కడ ఓట్లు వేయించుకునే కుట్రలు ఉన్నాయా? అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఏదేమైనా, హింసాకాండ మళ్లీ తలెత్తకుండా కేంద్రం, మణిపూర్ రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇరుపక్షాలతో కలిసి సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలి.