సంపన్న, వర్ధమాన దేశాల మధ్య వైరుధ్యం ప్రపంచ వాతావరణ సదస్సులో మరోమారు ప్రస్ఫుటమైంది. 190 దేశాలకు చెంది న వేలాది మంది ప్రతినిధులు రెండువారాల పాటు చర్చలు జరిపి నా.. కాప్-27 సదస్సు మెరుగైన ఫలితాన్నేమీ అందించలేకపోయిం ది. మానవాళిపైకి ముంచుకొస్తున్న మహా విపత్తును ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలూ కలిసి ఐక్యగళాన్ని వినిపించలేకపోయాయి. ఫలితంగా నిర్దిష్టమైన కార్యాచరణ లేకుండానే సదస్సు ముగిసింది. అయితే, పర్యావరణ పరంగా జరిగిన నష్టాలను భర్తీ చేయటానికి ఒక నిధిని ఏర్పాటుచేయాలన్న ప్రకటన సానుకూల సంకేతమే.
సంపన్న, ఆధునిక, పారిశ్రామిక దేశాలు శతాబ్దాలుగా కర్బన ఉద్గారాలను భారీ ఎత్తున వెలువరించి, భూమి ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమయ్యాయి. కానీ, దుష్ఫలితాలను మాత్రం చిన్న, పేద, ద్వీప దేశాలు అనుభవిస్తున్నాయి. తమకు జరిగిన నష్టాలను భర్తీ చేసుకోవటానికి సంపన్న దేశాలు పరిహారం చెల్లించాలని ‘చిన్న ద్వీప దేశాల కూటమి’ వంటివి దాదాపు 30 ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాయి. వాటి సుదీర్ఘ పోరాటం పాక్షికంగానైనా ఫలించి నిధి ఏర్పాటుపై ఒక ప్రకటన కాప్-27 వేదికగా వెలువడింది. కానీ, ఏ దేశం ఎంత చెల్లించాలి? బాధిత దేశాలను ఎలా గుర్తించాలి? వాటికి ఏ విధంగా పరిహారం పంపిణీ జరగాలి? వంటి స్పష్టత లేదు. వచ్చే కాప్ సదస్సులోగానైనా దీనిపై కసరత్తు జరిపి, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. కర్బన ఉద్గారాలను భారీ ఎత్తున వెలువరిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ నిధికి సొమ్ము సమకూర్చాలన్న ప్రతిపాదన వివాదాస్పదమైనది. భారత్ వంటి దేశాలు ఓవైపు పర్యావరణ నష్టాలను భరిస్తూ, మరోవైపు పరిహారం చెల్లించాలంటే తలకు మించిన భారమవుతుంది. దీనిపైనా స్పష్టత అవసరం. బాధి త దేశాల మధ్య చీలిక తెచ్చి, తమపై ఒత్తిడి తగ్గించుకోవటానికే అగ్రరాజ్యాలు ఈ ప్రతిపాదన తెచ్చాయన్న అభిప్రాయం కూడా ఉంది.
ఐరాస ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఏటా ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతుంది. కానీ, ముగిసిన తర్వాత చూస్తే పరిష్కారం దిశగా గట్టి కృషి కనిపించదు. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఈ సదస్సులో ఎవరిపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేరు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటంగానీ, పరిహార నిధికి విరాళాలు ఇచ్చే విషయంగానీ ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రకటనలు చేయటమే. అంతేగాక, ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలంటే భాగస్వామ్య దేశాలన్నింటి సమ్మతి అవసరమవుతున్నది. దీనివల్ల విపరీతమైన జాప్యం, అస్పష్టత, కార్యాచరణ లేకపోవటం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. వీటి పరిష్కారానికి, ప్రజాస్వామిక సంస్థల తరహాలో మెజారిటీ ఓటు ప్రాతిపదికన కాప్ను నిర్వహించటం వంటి ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. భూగోళం భవిష్యత్తు కోసం, మానవాళి మనుగడ కోసం సంపన్నదేశాలు తమ వైఖరిని మార్చుకోవాలి. ఈ మేర కు వాటిపై వర్ధమాన, పేద దేశాలు కలిసికట్టుగా ఉద్యమించాలి.