అమెరికా అధ్యక్ష ఎన్నికల తంతులో మహా మంగళవారం (సూపర్ ట్యూజ్డే) ముగిసింది. పోయినసారి తలపడిన ఇద్దరు ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులుగా బరిలో మిగిలారు. ప్రధాన అభ్యర్థులు ఆ ఇద్దరే అయినా సిట్టింగ్ ప్రెసిడెంట్ తారుమారు కావడం విశేషం. డెమొక్రాటిక్ అభ్యర్థిత్వానికి పెద్దగా పోటీ లేకపోయినా రిపబ్లికన్ టికెట్ కోసం పలువురు తలపడ్డారు. వారిలో భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఉండటం గమనార్హం. వ్యాపారవేత్త అయిన వివేక్ రామస్వామి ముందే తప్పుకోగా, సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ సూపర్ ట్యూజ్డేకు ఒకరోజు ముందుగానే పోటీ నుంచి నిష్క్రమించారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రస్తుతం దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. బైడెన్ బహుశా ఈ సారి కూడా ఆమెనే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకునే అవకాశాలున్నాయి. అమెరికా అత్యున్నత అధికార పీఠాలకు జరిగే ఎన్నికల్లో పెరుగుతున్న భారత సంతతి నేతల ప్రాబల్యానికి ఇది అద్దం పడుతున్నది.
ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతల్లో అత్యధికులు ట్రంప్కు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కానీ చివరిదాకా అభ్యర్థిత్వం కోసం పోటీ పడి చివరి నిమిషంలో వైదొలిగిన నిక్కీ హేలీ మాత్రం ట్రంప్ను బలపరచకపోవడం గమనార్హం. ఇద్దరు అభ్యర్థులూ ఎనభయ్యోవడికి అటు ఇటుగా ఉన్న ముదివగ్గులే. ఇద్దరి జ్ఞాపకశక్తి, నిర్ణయశక్తి మీద సందేహాలున్నాయి. వారి పాపులర్ రేటింగ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. యువశక్తికి అవకాశాలెప్పుడు అనే ప్రశ్నలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా అగ్రపీఠంపై ఓ మహిళ కూర్చునేది ఎప్పుడనే ప్రశ్న ఎప్పటినుంచో వేలాడుతూనే ఉన్నది. పోయినసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ హోరాహోరీగా తలపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫలితాల లెక్కింపులో బైడెన్ విజేతగా తేలడం, ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా నానా యాగీ చేయడం అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘట్టంగా నిలిచింది. ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్ భవనం మీద దాడికి తెగబడటం ఈ ధోరణికి పరాకాష్ఠ. ఈ వ్యవహారంపై రకరకాల విచారణలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పి సంచలనం కలిగించింది. అయితే చివరికి సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో ఆయనకు దారులు సుగమమయ్యాయి. తీవ్ర జాతీయవాదిగా పేరుపడిన ట్రంప్ తన హయాంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అమెరికాకు వలస వచ్చేవారికి ఇచ్చే వీసాలపై ఆయన పలు నియంత్రణలు ప్రవేశపెట్టారు. ఒక వర్గం వారికి ప్రవేశం లేదంటూ ఆయన జారీచేసిన ఫర్మానా తీవ్ర విమర్శలకు గురైంది. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి వచ్చేవారిని అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ లాంటి కంచె కట్టారు. ప్రపంచవ్యాప్తంగా అతివాద నాయకత్వాలు అధికారంలోకి వస్తున్న ధోరణికి ట్రంప్ పాలన ఓ సూచికగా నిలిచింది. మరోవైపు బైడెన్ సామరస్య వాదిగా ముందుకువచ్చి ట్రంప్ రెండో విడత గెలవకుండా అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు రెండోసారి ఆ ఇద్దరే చివరికి పోటీలో మిగలడం అమెరికా రాజకీయ వైచిత్రి.