కర్ణాటకలోని పలు ప్రాంతాలు కరవు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరమైన బెంగళూరు కనీవినీ ఎరుగని తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. ఫలితంగా ఐటీ నగరంలో రోజువారీ జీవితం దుర్భరంగా మారింది. గత ఏడాది వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి, 50 శాతం బోరుబావులు ఎండిపోయాయి. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంట్లోని బోరే బోసిపోవడం వార్తలకెక్కింది. బెంగళూరు మహా నగరం పరిధిలోని అనేక తాలూకాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని పరిమితంగా ఉదయం పూట కొద్దిసేపు మాత్రమే వదులుతున్న అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు ఇదే అవకాశమని ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ప్రజలను ఎడా పెడా దోచుకుంటున్నారు. ట్యాంకర్ల నీటి సరఫరా మీదే ఎక్కువగా ఆధారపడే దవాఖానలపై దీనివల్ల అదనపు భారం పడుతున్నది.
భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన బెంగళూరు నుంచి టెకీలు నీటిగోస తట్టుకోలేక పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. నగర ఐటీ కంపెనీల్లో మరోసారి ‘వర్క్ ఫ్రం హోం’ విధానం తెరమీదికి వస్తున్నది. ఐటీ పరిశ్రమలో ఇంటివద్ద పని అనేది తప్పనిసరి చేయాలనే డిమాండ్ వినవస్తున్నది. అలాగే విద్యాసంస్థల్లోనూ ఆన్లైన్ బోధన తప్పనిసరి చేయాలనే విజ్ఞాపనలూ ప్రభుత్వానికి అందుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా నీటి ఎద్దడి ప్రభావం పడింది. నీటి కొరత భయంతో చాలామంది కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎదురవుతున్న నీటిఎద్దడికి ఎల్నినో ప్రభావం కారణమని వాతావరణ నిపుణులు సెలవిస్తున్నారు. దీనివల్ల పోయిన ఏడాది వర్షపాతంలో లోటు నమోదైంది. ఈ ఏడాది వేసవి కూడా మామూలు సమయం కంటే ముందే వచ్చింది. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువే ఉంటుందని, వర్షపాతం అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడునాలుగు దశాబ్దాల్లో ఇంతటి నీటి సమస్య ఎప్పుడూ రాలేదంటున్నారు. బెంగళూరుకు నీటిని సరఫరా చేసే మాండ్యాలోని కృష్ణరాజసాగర్ జలాశయంలో నీరు అడుగంటడంతో నగరం పరిస్థితి దయనీయంగా తయారైంది.
కరవు నేపథ్యంలో కృష్ణరాజసాగర్ నుంచి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ వివాదం రెండు రాష్ర్టాల మధ్య తాజాగా చిచ్చు పెడుతున్నది. నీటి కరవు ప్రభుత్వ యంత్రాంగానికి, పౌరులకూ మధ్య కూడా ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. వాహనాలు కడగడం, చెట్లకు పోయడం వంటి అత్యవసరం కాని పనులకు నీటిని వినియోగించడంపై అధికారులు నియంత్రణలు విధించారు. అలా చేసినవారికి రూ. 5 వేల జరిమానా విధించనున్నట్టు బెంగళూరు నీటి సరఫరా బోర్డు ఆదేశాలు జారీ చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నిబంధన అమలుపై సందేహాలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా వేసే బోర్లకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అని కూడా మరో నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రస్తుత బెంగళూరు నగర దుస్థితికి ప్రకృతి ప్రకోపం, మానవ కృషి లోపం రెండూ కారణమేనని చెప్పాలి. ఆ రాష్ట్ర పాలకుల్లో దీర్ఘకాలిక వ్యూహం కొరవడటం ప్రజలకు శాపంగా మారింది. నీటి సరఫరా వంటి మౌలిక వసతులను పట్టించుకోకుండా నగరాలను విస్తరించుకుంటూపోతే ఎదురయ్యే విపత్తులకు బెంగళూరు పరిస్థితి అద్దం పడుతున్నది. మహా నగరాల ప్రణాళికా కర్తలకు బెంగళూరు అనుభవం ఓ కనువిప్పు కాగలదని భావించవచ్చు.