గాజా యుద్ధం రోజురోజుకూ రావణకాష్టంలా మారుతున్నది. చిలికిచిలికి గాలివానలా మారి ఇతర దేశాలను చుట్టుముడుతుందా? అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పనామా కాలువ గుండా తిరిగే అంతర్జాతీయ నౌకలపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల జరుపుతున్న దాడులు ప్రపంచ దేశాలకు సమస్యగా మారుతున్నది. గాజాలోని పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వారు దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు రసాయనాలతో వస్తున్న ఓడపై జరిగిన డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. డ్రోన్ దాడి వల్ల వ్యాపించిన మంటలు వెంటనే ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దేశాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల మంటలు పైపైకి లేస్తున్నాయి.
మరోవైపు రక్షణ దళాల మోహరింపు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆ నౌక ఇజ్రాయెలీ కుబేరుడు ఐదాన్ ఓఫెర్కు చెందినది కావడం గమనార్హం. ఇరాన్ భూభాగం నుంచి జరిపిన డ్రోన్ దాడి వల్లే నౌకలో మంటలు వ్యాపించాయని అమెరికా ఆరోపించింది. ఇటీవలి కాలంలో నౌకలపై ఎన్నోసార్లు దాడులు జరిగినప్పటికీ అగ్రరాజ్యం ఇలా సూటిగా ఇరాన్పై ఆరోపణ చేయడం ఇదే ప్రథమం. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమానికి అమెరికా ఇస్తున్న మద్దతుపై ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకే వాషింగ్టన్ ఈ తరహా సంచలన ఆరోపణలు చేసిందని ఇరాన్ ఎదురుదాడికి దిగింది.
ఈ వ్యవహారాన్ని స్థూలంగా గమనిస్తే ఇజ్రాయెల్ కంపెనీకి చెందిన ఓడలో సౌదీ రసాయనాలు భారత్కు తరలిస్తుంటే ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. పైకి చూస్తే చిన్న డ్రోన్ దాడిలా కనిపించే ఈ ఘటన ఇన్ని దేశాలను చుట్టేసిందన్నమాట. ఒకవేళ ఇరాన్ కాకుండా ఆ దేశం అండదండలు అందిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులే డ్రోన్ దాడి చేశారని అనుకుంటే వారు ఇటీవల జరిపిన దాడులన్నిటిలోకెల్లా ఇదే సుదూరమైనది అవుతుంది. హౌతీల దాడులు ఎర్రసముద్రం, యెమెన్ తీరంలోని బాబ్-అల్ మందాబ్ జలసంధి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం. కానీ తాజా డ్రోన్ దాడి గుజరాత్ తీరానికి 370 కిలోమీటర్ల (200 నాటికల్ మైళ్లు) దూరంలో జరిగింది. ఇది సహజంగానే భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
హౌతీ దాడులను అడ్డుకునేందుకు బహుళ పాక్షిక నౌకాదళ చొరవను అమెరికా ప్రకటించింది. అందులో బ్రిటన్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, సీషెల్స్ తదితర దేశాలున్నాయి. ఈ తరహా అంతర్జాతీయ స్పందన ఓవైపు సాగుతుండగానే మరోవైపు భారత్ తన వాణిజ్య ప్రయోజనాల రక్షణకు మూడు యుద్ధనౌకలను అరేబియా సముద్రంలో మోహరించింది. ఇలా పలు దేశాలు తమ రక్షణ బలగాలను పంపించడం దాడుల దృష్ట్యా తక్షణ అవసరంగా కనిపిస్తున్నప్పటికీ ఏ చిన్న నిప్పురవ్వ ఎగిరిపడినా దేశాల మధ్య యుద్ధాలు తలెత్తే ప్రమాదముంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ యువరాజు హత్యతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. పోలెండ్పై జర్మనీ దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ప్రస్తుతం వాణిజ్య నౌకాయానం ఎదుర్కొంటున్న సమస్యకు మూలం గాజాలో ఉన్నది. మూలంలో మందు వేస్తే ప్రపంచ శాంతికి దోహదం చేస్తుంది. అందుకు అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలూ కలిసిమెలిసి కృషి చేయాల్సి ఉన్నది.