రెండో రోజూ భక్తుల రద్దీ.. లక్ష మంది రాక
మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
పట్నాలు వేసి.. బోనాలు సమర్పించి మొక్కులు
పోలీసుల భారీ బందోబస్తు
జైపూర్, మార్చి 12 : వేలాల భక్తజన సంద్రమైంది. శుక్రవారం రెండో రోజూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఉదయం నుంచి క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి.. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. – జైపూర్, మార్చి 12
వేలాల మల్లికార్జున స్వామి క్షేత్రం.. జనసంద్రమైంది. మహాశివరాత్రి సందర్భంగా జాతర రెండోరోజైన శుక్రవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు గుట్టపై హడావిడి కనిపించింది. వేలాల గోదావరి తీర ప్రాంతంతో పాటు గ్రామ శివారు మొత్తం గుడారాలతో కిక్కిరిసింది. గురువారం గుట్టపై గట్టు మల్లన్నను దర్శించుకున్న భక్తులు, శుక్రవారం కిందకు పయనమయ్యారు. బోనాలు వండి, మల్లికార్జున స్వామికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమేశ్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం సురేశ్ దంపతులు గట్టు మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. జైపూర్ ఏసీపీ నరేందర్ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, జైపూర్ ఎస్ఐ రామకృష్ణతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
కత్తెరశాలలో పట్నాలు.. బోనాలు..
చెన్నూర్ రూరల్, మార్చి 12 : కత్తెరశాల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మంచిర్యాల, బెల్లంపల్లితో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. బోనాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేశారు. ఆలయ ఈవో అనూష భక్తులకు సౌకర్యాలు కల్పించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. చెన్నూర్ సీఐ ప్రమోద్రావు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుగ్గలో పోటెత్తిన భక్తులు..
బెల్లంపల్లి రూరల్, మార్చి 12 : బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బోనాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగ చూడాలంటూ వేడుకున్నారు. అనంతరం అక్కడే వనభోజనాలు చేశారు. ఆలయ ఈవో పెండ్యాల వామన్రావు, చైర్మన్ మాసాడి శ్రీదేవి ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. రాంపూర్ గ్రామానికి చెందిన గెడెం విద్యానంద్(4) బాలుడు తప్పిపోగా, తాళ్లగురిజాల ఎస్ఐ బానోతు సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు వెతికి పట్టుకున్నారు. తల్లి ప్రమీలకు అప్పగించారు.
ముగిసిన ఈజ్గాం జాతర..
కాగజ్నగర్ రూరల్, మార్చి 12 : ఈజ్గాం శివమల్లన్న జాతర ముగిసింది. పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.