పర్యావరణానికి హాని కలిగించని నిర్మాణాలు భాగ్యనగరంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. నగరవాసులు కూడా ఆహ్లాదం, ఆరోగ్యానికే పెద్దపీట వేస్తూ.. పర్యావరణహిత నివాసాలకే మొగ్గు చూపుతున్నారు. పచ్చదనం నిండిన ప్రాంతాల్లోనే తమ కలల గృహాన్ని సొంతం చేసుకొంటున్నారు. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నారు. నివాస గృహాలతోపాటు వివిధ కార్పొరేట్ సంస్థలు కూడా హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాంక్రీట్ జంగిల్ను తలపించే మహానగరంలో.. హరిత నిర్మాణాలు ఊపందుకొంటున్నాయి.
పర్యావరణహితంగా, గృహస్తులకు అదనపు ప్రయోజనాలు కలిగేలా హరిత భవనాలను నిర్మిస్తున్నారు. వాడిన నీటిని శుద్ధి చేసి, పునర్వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విండ్ ఎనర్జీ, వాటర్ హార్వెస్టింగ్, సోలార్ పవర్తో40 శాతం విద్యుత్ ఆదా, సూర్యకాంతికి వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా నీటి వృథాను అరికడుతూ, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. గాలి నాణ్యత ఎక్కువగా ఉండేలా, ఇంట్లో ఉండేవారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగు పడేలా పరిసరాలన్నిటినీ పచ్చదనంతో నింపేస్తున్నారు. ఇంకా మరెన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పిస్తూ.. హరిత భవనాల కాన్సెప్ట్తో నగరవాసుల్ని ఆకర్షిస్తున్నారు. వెంచర్లలోనూ పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలైతే.. 50 నుంచి 60 శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాయి. పార్కులు, వాకింగ్ ట్రాక్లు, సోషల్ గార్డెనింగ్ కోసం వినియోగిస్తున్నాయి. ఇలాంటి హరిత భవనాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఐటీ పార్కులు ఎక్కువగా ఉంటున్నాయి.
అనేకానేక కారణాలతో నగరం కాలుష్యమయం అవుతున్నది. ఫలితంగా హరిత నిర్మాణాలకు ఆదరణ లభిస్తున్నది. ఈ భవనాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లోనూ ప్రత్యేకమైన మొక్కలను పెంచే అవకాశం ఉంటుంది. తద్వారా కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. పచ్చదనంతో మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. శబ్ద, వాయు కాలుష్యాల నుంచి సాంత్వలభిస్తుంది.
–ఏఆర్ జైపాల్ రెడ్డి, ఫాల్గుణ ఆర్కిటెక్ట్స్