సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్సు చౌరస్తాలో మలుపుతిప్పే క్రమంలో హారన్ కొట్టినందువల్ల కారులో కూర్చున్న తమ యజమానురాలు భయపడిందంటూ ఓ కారు డ్రైవరు బస్సు డ్రైవర్పై చేయిచేసుకోవడమే కాకుండా బస్సు అద్దాన్ని ధ్వంసం చేశాడు.
బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన వెలమకన్న శ్రీశైలం (36) మెదక్ డిపోలో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. రోజులాగే ఈనెల 27 న సాయంత్రం 4:30 గంటలకు టీఎస్ 35 టీ 7786 నెంబరుగల బస్సును తీసుకొని డిపోనుంచి జేబీఎస్ కు బయలుదేరాడు. రాత్రి 7.25 గంటలకు బస్సు తాడ్బండ్ క్రాస్ రోడ్డుకు చేరుకుంది.
చౌరస్తాలో బస్సు కుడివైపుకు తిప్పుతూ హారన్ కొట్టాడు. ఎదురుగా వెళ్తున్న టీఎస్08 ఎఫ్ 0101 నెంబరుగల కారు డ్రైవరు కారును బస్సుకు అడ్డంగా నిలిపి బస్సులోకి వచ్చాడు. హారన్ కొట్టడంవల్ల కారులో కూర్చున్న తమ యజమానురాలు భయపడిందంటూ శ్రీశైలంపై చేయిచేసుకున్నాడు.
అంతటితో ఆగకుండా బస్సు అద్దాన్ని పగులగొట్టి వెళ్లిపోయాడు. బాధితుని ఫిర్యాదుమేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.