పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం
పూర్తయిన డంపింగ్ యార్డు, వైకుంఠధామం
జాతీయస్థాయిలో రెండు అవార్డులు సొంతం
వాడవాడలా సీసీ రోడ్లు.., వీధి దీపాలు
కాటారం, మార్చి 28:‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న గాంధీ మహాత్ముడి మాటలకు గంగారం ఊరు సరిగ్గా సరిపోతుంది. మారుమూల గ్రామమైనా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకొని అభివృద్ధిలో మేటిగా నిలిచింది. పల్లెప్రగతిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఊరు బంగారంలా మెరిసిపోతున్నది. ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, సీసీరోడ్లు ఇలా గ్రామంలో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేసుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు సొంతం చేసుకొని జాతీయస్థాయిలో వెలిగిపోతున్నది.
కాటారం మండలంలోని గంగారం గ్రామం జనాభా 2,446. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఈ గ్రామరూపురేఖలు మారిపోయాయి. ఏడాదికి సుమారు రూ.30లక్షల నిధులు వస్తుండగా, పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో వాటిని ఖర్చు చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. రూ.8లక్షలతో ట్యాంకర్, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ కొనుగోలు చేశారు. 600 తడి, పొడి చెత్త బుట్టలను ఇంటింటికీ పంపిణీ చేసి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సుమారు రూ.8లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. నీడనిచ్చే, పూలు, రుద్రాక్ష, క్రోటాన్ వంటి 40 రకాల మొక్కలు నాటారు. రూ.12లక్షలతో ఆధునిక హంగులతో వైకుంఠధామం నిర్మించారు. అందులో బోరు, బర్నింగ్ ప్లాట్ఫాం, వెయిటింగ్ హాల్, వాష్రూంలు నిర్మించారు. సుమారు రూ.2.40 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. సుమారు రూ. 50 లక్షల నిధులతో 10 వార్డుల్లో కలిపి 3 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయించారు. హరితహారంలో భాగంగా గ్రామంలో 40 వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందుతున్నది. గ్రామంలో 20 గుంటల స్థలంలో నర్సరీని ఏర్పాటు చేసి 20 వేల మొక్కలను పెంచుతున్నారు.
జాతీయ స్థాయిలో రెండు అవార్డులు
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్(జీపీడీపీ) అవార్డు, దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్ పురస్కారం దక్కించుకుని గంగారం రికార్డు సృష్టించింది. మొదటి పురస్కారానికి భారత ప్రధాని నుంచి రూ.5లక్షల నగదు, రెండో అవార్డుతో మరో రూ.10లక్షల నగదు అందుకున్నది. అవార్డుల ద్వారా వచ్చిన డబ్బులతో గ్రామంలో ఫంక్షన్ హాల్ను నిర్మించేందుకు పాలకవర్గం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి..
ప్రభుత్వం, పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతోనే గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలుపగలిగా. విలాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గంగారం 1981లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం, పల్లె ప్రగతి కార్యక్రమాలతో ఊరి రూపురేఖలు మారాయి. కేంద్ర పురస్కారాలు రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తా.
క్రీడల్లోనూ ముందు వరుసే..
గంగారం గ్రామం పల్లె ప్రగతితో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. అంతేకాకుండా క్రీడల్లోనూ ముందు వరుసలోనే ఉంది. ముఖ్యంగా ఖోఖో, కబడ్డీలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులున్నారు. నేను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖోఖో, కబడ్డీ ఆడి సిల్వర్, బంగారు పతకాలు సాధించా. ప్రస్తుతం గంగారం మోడల్స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నా.
ఇవి కూడా చదవండి
పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
తిప్పతీగ ఎన్ని తిప్పలు తగ్గిస్తుందో తెలుసా..!