కోట్పల్లి, డిసెంబర్ 8 : అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఓగులాపూర్ గ్రామం నేడు కొత్తందాలు, అభివృద్ధితో పరిఢవిల్లుతున్నది. ఇంటింటికీ ట్రాక్టర్తో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, ఎరువులను తయారు చేస్తున్నారు. గ్రామస్తులు ఉదయం, సాయంత్రం వాకింగ్తో మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనంలో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటు చూసినా రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి.
ఓగులాపూర్ గ్రామంలో 192 ఇండ్లు, 720 కుటుంబాలు, 750 జనాభాలో 606 ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ, పల్లె ప్రకృతి వనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు స్థానిక సర్పంచ్ శోభారాణి. మురుగు కాల్వల బెడద లేకుండా అండర్డ్రైనేజీని ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లతో పాటు నూరు శాతం మరుగుదొడ్లు పూర్తి చేశారు. గ్రామానికి వెల్కం పలికే కమాన్ దగ్గర నుంచి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామంలో అభివృద్ధి పనులు
గ్రామంలో రూ.కోటి25 లక్షలతో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.5లక్షలు, జడ్పీ నిధులు రూ.13లక్షలతో సీసీ రోడ్డు, కేంద్రం కేటాయించిన రూ.20లక్షల్లో 14 లక్షలతో సీసీ రోడ్డు, 6లక్షలతో అండర్డ్రైనేజీ పనులు, డీఎంఎఫ్టీ ద్వారా తాండూరు ఎమ్మెల్యే కేటాయించిన రూ.5లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.12.50లక్షలతో వైకుంఠధామం, రూ.7.50 లక్షలతో పంచాయతీ పనులకు ట్రాక్టర్ కొనుగోలు, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.9 లక్షలతో పాడుబడ్డ బావుల పూడ్చివేత, మిషన్ భగీరథ పైపులైన్ పనులను పూర్తి చేశారు. రూ.15 లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు గ్రామం చుట్టూరా ఏండ్ల తరబడి ఉన్న కందకాన్ని సర్పంచ్ తన సొంత డబ్బులు రూ.20లక్షలతో పూడ్చివేయించారు. ఇంటింటికీ కొత్త వెలుగులు అందించాలను ఉద్దేశంతో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. వైకుంఠధామానికి కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, 24 గంటలపాటు సరఫరా జరిగేటట్లు చూస్తున్నారు. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో టేకు, చింత, జామ, నీలగిరి, దానిమ్మ, ఉసిరి, చైనాబాదాం, అల్లనేరేడు, మందారం, కాగి, కానుగ వంటి 2వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : శోభారాణి, సర్పంచ్
గ్రామంలో పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. పాడుబడ్డ ఇండ్లు, బావులను తొలగించాం. పాడుబడ్డ బావులపై జాలీలు ఏర్పాటు చేశాం. కందకాన్ని పూడ్చాం. ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేయిస్తున్నాం. మురుగు బెడద లేకుండా గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గ్రామం ఎటు చూసినా పచ్చని చెట్లు, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. ప్రజల సహకారంతో మా గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నా.
అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి : శ్రీకాంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి
గ్రామస్తుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేశాం. తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, ఎరువులను తయారుచేస్తున్నాం. ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం.
అంధకారంగా ఉన్న గ్రామాన్ని బాగు చేసుకున్నం
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మా గ్రామాన్ని తెలంగాణ సర్కారు వచ్చినాక అధిక నిధులను తెచ్చి అభివృద్ధి చేసుకున్నం. గ్రామం చుట్టురా కందకంతో మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లేది. దాన్ని పూర్తిగా మట్టితో మూసి, ఔటర్ రింగ్ రోడ్డుగా మార్చుకున్నం. పార్టీ తలపెడుతున్న పథకాలను గడపగడపకు చేర్చి మండలంలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.