తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 20: సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను తక్షణమే విరమించుకోవాలని మాది గ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న మాదిగ కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఉపాధి కోల్పోతున్న దళిత కుటుంబాలు సింగరేణిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సైఫాబాద్లో గల సింగరేణి భవన్ ముందు సోమవారం పలు మాదిగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి భూమన్న మాదిగ మాట్లాడుతూ.. సింగరేణిలోని కేంద్ర ప్రభుత్వం 49 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా మార్చేలా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ మాట్లాడుతూ.. సింగరేణిలో లక్షా 20వేల మంది పనిచేస్తున్నారని, వారిలో 32 వేల మంది దళిత కార్మికులేనని పేర్కొన్నారు. దండోరా జాతీయ అధ్యక్షుడు వేముల బలరాం మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షులు చింతల రాజలింగం, దండోరా రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్ మాదిగ మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణతో మాదిగ కుటుంబాలు వీధినపడి ఉపాధిలేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిని ప్రవేటీకరిస్తే కేంద్ర ప్రభుత్వానికి తగినరీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు. రిజర్వేషన్లను కాపాడుకునే పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల నేతలు కృష్ణమూర్తి, సాయిలు, ఈదురు అంజలి, గంగాభవానీ, లక్ష్మమ్మ, సుబ్బమ్మ పాల్గొన్నారు.