మహబూబ్నగర్ ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జడ్చర్లలో 27 వార్డులకు, అచ్చంపేటలో 20 వార్డులకు పోలింగ్ జరిగింది. అచ్చంపేటలో 68.81, జడ్చర్లలో 66.6శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కొవిడ్ పరిస్థితుల్లో జనం ఇండ్ల నుంచి వచ్చి ఓటేస్తారా అని అనుమానం వ్యక్తం అయిన తరుణంలోనూ మంచి పోలింగ్ శాతం నమోదు అవ్వడం విశేషం. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఓటర్లకు చైతన్యం కల్పించండం సైతం ఓటింగ్ శాతం పడిపోకుండా చేసిందని చెప్పవచ్చు. ప్రతి ఓటరూ మాస్కు ధరించి పోలింగ్ లో పాల్గొన్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే డా. సి. లక్ష్మారెడ్డి, అచ్చంపేటలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. తర్వాత కాస్త మందకొడిగా సాగింది. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మే 3న తెలియనున్నాయి.
గత ఎన్నికల్లో 20 వార్డులకు గాను మొత్తం క్లీన్ స్వీప్ చేసిన అచ్చంపేటలో ఈసారి అది రిపీట్ అవుతుందని టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇక తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగిన జడ్చర్లలో 27 స్థానాల్లో తమ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని మెజార్టీ స్థానాలు సునాయసంగా కైవసం చేసుకుంటామని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
పటిష్ట బందోబస్తు నడుమ..
పోలింగ్ అనంతరం జడ్చర్లలోని 27 వార్డులకు సంబంధించిన 54 పోలింగ్ కేంద్రాల నుంచి 108 బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన బందోబస్తు నడుమ పట్టణంలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ కు తరలించారు. స్ట్రాంగ్ రూంలో గట్టి బందోబస్తు మధ్యన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. జడ్చర్లలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పోలింగ్ ప్రక్రియను, కొవిడ్ నిబంధనలను పరిశీలించారు. అచ్చంపేట శివారులోని జేఎంజే పాఠశాలలో కౌంటింగ్ సెంటర్కు 20 వార్డుల పరిధిలోని 40 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 80 బ్యాలెట్ బాక్సులను తరలించారు. అచ్చంపేటలో కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ మను చౌదరి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
టీఆర్ఎస్ గెలుపు ధీమా..
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 5 మంది జెడ్పీ చైర్ పర్సన్లు, ఇటీవల ఎంఎల్సీ… ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తూ వచ్చిన అధికార పార్టీకి జడ్చర్ల, అచ్చంపేట ఎన్నికలు నల్లేరు మీద నడకే అన్న విధంగా ముగిశాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అచ్చంపేటలో తొలిసారి గత పర్యాయం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ మహా కూటమిగా తయారై పోటీ చేసినా అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించిన పార్టీకి… ఈ ఎన్నికల్లో విజయం పెద్ద విషయమే కాబోదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఈ సారి మరింత మెజార్టీ పెరుగుతుందని అంటున్నారు. ఇక తొలిసారిగా మున్సిపాలిటీగా మారిన జడ్చర్లలోనూ 27 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీదే జయకేతం అని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రం ప్రజల మధ్యకు వచ్చే ప్రతిపక్షాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశమే ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే వారినే ప్రజలు విశ్వసిస్తారని… ఆ విషయం జడ్చర్ల, అచ్చంపేట ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తాయని అంచనా వేస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు నమ్ముతారని ఈ ఎన్నికలు నిరూపిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కరోనా కష్టకాలంలోనూ పోలింగ్ బూత్లకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఓటర్లకు విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే డా. సి. లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.