బేగంపేట్ : 24 గంటల వ్యవధిలో ముగ్గురు రోగులకు రెండేసి ఊపిరి తిత్తులను విజయవంతంగా మార్చారు సికింద్రా బాద్ కిమ్స్ వైద్యులు. ఇలాంటి ఘటన ఆసియాలోనే మొట్టమొదటి సారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో పితామహుడిగా భావించే డాక్టర్ సందీప్ అత్తావర్ నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్సలు జరిగాయి.24 గంటల వ్యవధిలోనే ముగ్గురు రోగులకు శస్త్ర చికిత్సలు చేశారు. ఈ ముగ్గురి ఊపిరి తిత్తుల వైఫల్యం తీవ్రస్థాయిలో ఉండటంతో తప్పనిసరిగా ఊపిరి తిత్తులు మార్చాల్సి వచ్చింది.
ఊపిరి తిత్తులను ఇలా సేకరించారు..
తొలిజత ఊపిరితిత్తులను హైదరాబాద్లో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తినుంచి సేకరించారు. రెండో జత గుజరాత్లోని అహ్మదాబాద్లో సేకరించి చార్టర్డ్ విమానంలో హైదారబాద్కు తీసుకువచ్చారు. ఈ రెండు శస్త్రచికిత్సలు నవంబర్ 24 బుధవారం సాయంత్రం చేశారు.
మూడవది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సేకరించి గురువారం ఉదయం విమానమార్గంలో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్ర చికిత్స నిర్వహించారు.ఈ సంధర్భంగా డాక్టర్ సందీప్ అత్తావర్ మాట్లాడుతూ…
మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి దాతల నుంచి సేకరించిన ఊపిరి తిత్తులను మొత్తం 12 మంది ప్రత్యేక వైద్య నిపుణులు అనుభవజ్ఞలైన నర్సింగ్ సిబ్బంది కలిసి 6 నుంచి 8 గంటల సమయంలోనే రోగులకు అమర్చగలిగామని తెలిపారు. అందరూ పూర్తి స్థాయి సమన్వయంతో కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.