కొండాపూర్ : నేటి ఉరుకుల పరుగుల జీవన విధానంలో మానవ ఆరోగ్యంపై ఆహారం ప్రధాన భూమిక పోషిస్తుంది. కొంత వయస్సు వచ్చాక మాంసాహారం కంటే శాఖాహారం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయినా మాంసాహార ప్రియులు తమ భోజన అలవాట్లను మార్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
అలాంటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు భిన్న రుచులతో కూడిన శాఖాహారాన్ని అందించే వివిధ సంస్థలతో ఆదివారం మాదాపూర్లోని ఫీనిక్స్ ఏరీనాలో వేగన్ ఎక్స్పో (మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులు) పేరిట ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
రూపా ఓబుల్రెడ్డిగారి, ప్రణవి పంగనూరిల ఆధ్వర్యంలో మొక్కల నుంచి తయారు చేసిన పలు రకాల ఆహార పదార్థాల ఉత్పత్తి సంస్థలతో ప్రత్యేక వేగన్ స్టార్టప్లతో ప్రదర్శనను నిర్వహించారు. జంతువుల ప్రమేయం లేకుండా పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం, పాలు, పాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.
మాంసాహారం లేకుండా మాంసాన్ని తిన్న అనుభూతినిచ్చేలా, జంతువుల నుంచి తీసిన పాలకు బదులుగా సోయాబీన్, కొబ్బరి పాలు, పాల ఉత్పత్తులతో తయారు చేసిన అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. ఐస్క్రీం , స్వీట్లు, రకరకాల ఆర్గానిక్ కూరగాయాలు, దినుసులను స్టాల్స్లో ఉంచారు. బియాండ్ మీట్ అనే మాంసం లాంటి మొక్కల నుంచి తయారు చేసిన పదార్థాన్ని బర్గర్ల తయారీలో వినియోగిస్తున్నారు.
సోయాబీన్, కొబ్బరిల నుంచి తీసిన పాలతో ప్రత్యేకంగా ఐస్క్రీం, సోయా పాలు, పెరుగు, పన్నీరు వంటి పాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. నో భీఫ్ పేరిట ప్రారంభించిన స్టార్టప్లో భీఫ్ లేకుండా ఆ రుచిని అందించే ప్రత్యేక పదార్థాలను అందిస్తున్నారు. చిట్చాయ్ పేరిట అనేక రకాల టీ ఉత్పత్తులను టీ ప్రీయులకు అందజేస్తున్నారు. డైరీ ఉత్పత్తులను ఉపయోగించకుండా తయారు చేసిన ఐస్క్రీంలు, చాక్లెట్లను అంతేరుచిగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.