సూర్యాపేట, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తిరుమలగిరి మండలంలో దళిత బంధు అమలుకు కార్యాచరణ మొదలైంది. ఇప్పటికే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధ్యక్షతన మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, దళితులతో సమావేశం నిర్వహించగా తాజాగా దళిత కమిటీలను పూర్తి చేశారు. సోమవారం ఉద్యోగులు, అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమించే ప్రక్రియ చేపట్టారు. మరో మూడు రోజుల్లో కమిటీలు, ఎన్యూమరేటర్లకు శిక్షణలు పూర్తి చేసి ఇంటింటికీ సర్వే చేయనున్నారు.
ఎన్యూమరేటర్ల నియామకం పూర్తి
దళిత బంధు పక్కాగా అమలు చేసేందుకు తిరుమలగిరి మండలంలోని 16 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించిన వార్డులో దళిత కమిటీలు వేశారు. ప్రతి కమిటీలో ఆయా గ్రామాలు, వార్డుల నుంచి ఆరుగురు చొప్పున గుర్తించగా వీరిలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. అలాగే ఎన్యూమరేటర్లు, మండల స్థాయి టీం, జిల్లా సూపర్వైజర్లు కలిపి 80 మందిని నియమించారు. మండల, జిల్లా స్థాయి అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమించారు.
రెండు రోజుల్లో శిక్షణ..
కమిటీలు, ఎన్యుమరేటర్ల నియామకాలు పూర్తయినందున వీరికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు రెండు మూడు రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్యుమరేటర్లు 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు నమోదు చేస్తారు. మొత్తం కుటుంబాలెన్ని, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి వృత్తుల్లో ఉన్నారు.. ఏం వ్యాపారాలు చేస్తున్నారో గుర్తిస్తారు. సర్వేను మండల, జిల్లా స్థాయి బృందాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
తేలనున్న లెక్క
సర్వే అనంతరం మండలంలో దళిత కుటుంబాల లెక్క పక్కాగా తేలనుంది. 2014 ఎస్కేఎస్ లెక్కల ప్రకారం మండలంలో 16 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ కలిపి 12,440 నివాస గృహాలకుగాను 2,398 దళిత నివాసాలు ఉన్నాయి. మండలంలో 15 ఎస్సీ వార్డులు, 23 దళిత వాడలు ఉన్నాయి. ఎస్కేఎస్ లెక్కల అనంతరం వివాహాలు కావడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి లెక్కలు తేలనున్నాయి. ఇది 15 రోజుల్లో పూర్తి కానుండగా అనంతరం కుటుంబాల సంఖ్య ప్రకారం నిధులు విడుదల కానున్నాయి.
ఇక సర్వే చేయడమే ..
ఇప్పటికే దాదాపు దళిత సంఘాలతో కమిటీలు పూర్తి కాగా ఎన్యుమరేటర్ల నియామకం కూడా అయ్యింది. శిక్షణ అనంతరం మండలంలో ప్రతి దళిత కుటుంబాన్ని సర్వే చేసి వివరాలు నమోదు చేస్తాం. ప్రణాళికాబద్ధంగా దళిత బంధు అమలు చేస్తాం.