necklace
చార్మినార్ : పోగొట్టుకున్న ఓ పర్యాటకురాలి నెక్లెస్ తిరిగి లభించిన ఘటన హుస్సేనీఅలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జీ. నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం చార్మినార్ సమీపంలోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శన కోసం వచ్చారు.
ప్యాలెస్ సందర్శన అనంతరం చార్మినార్ను సందర్శించడానికి వెళ్తున్న ఆ కుటుంబంలోని ఓ మహిళ తన మెడలోని నెక్లెస్ కనిపించక పొవడంతో ఆందోళన చెందారు.వెంటనే బాధితులు హుస్సేనిఅలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు చౌమహల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఓ చోట భాధితురాలి నెక్లెస్ను గుర్తించిన ప్యాలెస్ సెక్యూరిటీ సిబ్బంది నెక్లెస్ను హుస్సేనిఅలం పోలీసులకు అప్పగించారు. పోయిందనుకున్న విలువైన నెక్లెస్ తిరిగి లభించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. వెంటనే స్పందించిన పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి ఆ కుటుంబం ధన్యవాదాలు తెలియజేసింది.