బోథ్, మే 12 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అజ్జర్-వజ్జర్ గ్రామ పంచాయతీ(మహాదుగూడ, లేండిగూడ) సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై) కింద ఎంపికైంది. అభివృద్ధి పనులతో జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు సాధించింది. రాష్ట్రస్థాయిలో 89.39 శాతం పాయింట్లతో మరోసారి 15వ ర్యాంకు తెచ్చుకుంది. రూ.13 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణం, ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం భవనాలకు మరమ్మతులు చేపట్టారు.
రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మండు వేసవిలోనూ మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రూ.2 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.4 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్లు,రూ.13.50 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. రహదారుల వెంట హరితహారం కింద మొక్కల పెంపకం చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పల్లెలో చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
వారానికోసారి హరితహారం, ఎవెన్యూ ప్లాంటేషన్ కింద పెంచుతున్న మొక్కలకు నీటిని అందిస్తున్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ఎంపికైన ఏడు నెలల కాలంలోనే జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు రావడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలనెలా కేటాయిస్తున్న నిధులతో పనులు చేపడుతున్నాం. అసంపూర్తిగా ఉన్న జీపీ భవనాన్ని పూర్తి చేయించి వినియోగంలోకి తెచ్చాం. సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం పనులు చేయించాం. మండు వేసవిలో తాగడానికి నీరు దొరకని పరిస్థితుల్లో పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం. ఈ పనులతోనే వజ్జర్ గ్రామ పంచాయతీకి జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది.
– సిడాం భూంబాయి, సర్పంచ్, వజ్జర్
గతంలో కంటె పల్లె సౌకర్యాలు మెరుగు పడ్డాయి. మిషన్ భగీరథ పథకం కింద నల్లాల్లో నీరు వస్తుండంతో తాగు నీటి ఇబ్బందులు తప్పిపోయాయి. చెత్తను సేకరిస్తుండడంతో పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. మారుమూలనున్న మా పల్లెకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది.
– కోవ విఠల్, గ్రామస్తుడు, వజ్జర్
అనార్యోగంతో నా భర్త చనిపోయిండు. దీంతో పుట్టినింట్లో ఉంటున్న. నాకు ఏ ఆధారం లేదు. బీడీలు చుడుతూ బతుకుతున్న. ప్రభుత్వ పింఛన్ కింద ప్రతినెలా రూ. 2016 రాగా, ఇటీవలే కొత్త రేషన్కార్డు మంజూరైంది. ప్రతినెలా ఉచితంగా బియ్యం, బీడీల పెన్షన్ రావడంతో ఎవరిపై ఆధారపడకుండా గౌరవంగా బతుకుతున్న. 2014కు ముందు చాలీచాలని పెన్షన్ ఉండేది. రేషన్కార్డు కూడా అప్పుడు ఇయ్యలే.
– నానం రజిత, ఓలా
నేను వ్యవసాయం చేస్తున్న. నేను నా భార్య పంట భూమిని నమ్ముకొని బతికేవాళ్లం. మాకు ముగ్గురు ఆడపిల్లలు, మాలాగా మా బిడ్డలకు కష్టం ఉండవద్దని బాగా చదివించాలని అనుకున్న. ప్రైవేటులో ఫీజులు కట్టలేక ఇబ్బందికి గురయ్యాం. తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేయడంతో మా పెద్ద పాపకు ఇచ్చోడలో సీటు రాగా, చిన్న పాపకు లెఫ్ట్ పోచంపాడ్లో ఫ్రీ సీటు వచ్చింది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే విద్యను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– మాల భోజన్న, ఓలా