దశాబ్దాల సమస్యలు పరిష్కరించేందుకు ‘జీడబ్ల్యూఎంసీ’ కసరత్తు
143 బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక
రూ.131.31 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక
త్వరలో ఆమోదం తెలుపనున్న సర్కారు
వరంగల్, జూలై 30 : దళిత బస్తీల్లో ప్రగతి బాటలు పడుతున్నాయి. ఏళ్ల తరబడి దారిద్య్రంలో మగ్గుతున్న బస్తీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దళిత బస్తీల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాల పెంపుతోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఇటీవల జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో క్షేత్రస్థాయిలో తిరిగిన అధికారులు అక్కడి సమస్యలను గుర్తించారు. 143 దళితబస్తీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, తాగునీటి పైపులైన్, వ్యక్తిగత మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, కల్వర్టుల నిర్మాణాలకు రూ.131.31కోట్ల అంచనాలతో రూపొందించిన నివేదికను వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. త్వరలోనే దీనికి ఆమోదం లభించనుంది.
పట్టణ ప్రగతితో అభివృద్ధి నివేదిక
జూలై ఒకటి నుంచి 10 వరకు జరిగిన పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అనేక ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత బస్తీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధి చెందిన కాలనీలతో సమానంగా గ్రేటర్లోని అన్ని దళిత బస్తీలను నిలుపాలన్న సంకల్పంతో అధికారులు ప్రగతి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.