సాఫీగా ధాన్యం అమ్ముకుంటున్న రైతులు
కరోనా కష్టకాలంలో కర్షకుడు ఊరుదాటకుండా సర్కారు ఏర్పాట్లు
పడిగాపుల ఇబ్బందుల్లేకుండా టోకెన్లు
ప్రతి సెంటర్లో కుర్చీలు, తాగునీరు..
పలు చోట్ల నీడ కోసం టెంట్లు
వర్షానికి తడువకుండా టార్పాలిన్లు
అందుబాటులో ప్యాడీ క్లీనర్లు, తేమకొలిచే యంత్రాలు
ఊరికో ప్రత్యేక పర్యవేక్షణాధికారి
ఎప్పటికప్పుడు మిల్లులకు వడ్ల తరలింపు
వరంగల్ రూరల్, మే 1 (నమస్తేతెలంగాణ):అందరికీ అన్నం పెట్టే రైతు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా ఊతమిస్తున్నది. దీనికి తోడు కరోనా కష్ట కాలంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి రైతులకు అండగా నిలుస్తున్నది. పండించిన పంటను అమ్ముకునేందుకు కర్షకులు ఊరుదాటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే సకల వసతులతో సెంటర్లు పెట్టి ధాన్యం కొంటున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,034 కేంద్రాలకు గాను ఇప్పటికే 563 కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లను ముమ్మరం చేయడంతో పాటు రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు నగదు జమ చేస్తున్నది.
తెలంగాణ సర్కారు రైతుల నుంచి యాసంగి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్నది. ఇందుకోసం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు గ్రామాల్లో సెంటర్లను ప్రారంభించింది. వీటిలో రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. సకల సౌకర్యాలతో కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మద్దతు ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిని చెరువుల్లోకి తరలించడంతో జిల్లాలో యాసంగి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రైతులు 1,31,656 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 3,24,322 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఇందులో 50 వేల టన్నులు స్థానికంగా వినియోగమైతే.. 74,322 టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లర్లు కొనే అవకాశం ఉందని ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి సుమారు రెండు లక్షల టన్నుల యాసంగి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం గతంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 175 కొనుగోలు కేంద్రాలకు తోడు మరో 19 సెంటర్లను గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. రైతులకు మద్దతు ధర దక్కాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. 194 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు అనుమతి ఇచ్చింది. వీటిలో అత్యధికంగా పీఏసీ ఎస్లకు 125, ఐకేపీకి 57, ఏఎంసీలకు 6, జీసీసీకి 1, ఇతరులకు ఏడు సెంటర్లను కేటాయించింది. దీంతో ఈ సెంటర్ల నిర్వహణకు సహకార, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు
గ్రామాల్లో యాసంగి ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం తమకు కేటాయించిన సెంటర్లలో సహకార, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ శాఖల అధికారులు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రతి సెంటర్లో రైతులకు నీడ కోసం టెంట్ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, కుర్చీలను సమకూర్చుతున్నారు. వర్షం పడితే తడవకుండా రైతులు తమ ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుతున్నారు. తేమ శాతం చూసేందుకు తేమకొలిచే యంత్రం, ధాన్యాన్ని శుభ్రం చేసేందుకు ప్యాడీక్లీనర్, తూకం వేసేందుకు వెయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించేందుకు సెంటర్ల నిర్వాహకులు రైతులకు గన్నీ సంచులను ఇస్తున్నారు. సీరియల్ పద్ధతిన ధాన్యం సెంటర్లకు చేరుకునేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు గ్రామాల్లోనే రైతులకు కూపన్లు జారీ చేస్తున్నారు. కరోనా నిబంధనల అమలుకు ప్రతి సెంటర్లో రైతులు, హమాలీలు, నిర్వాహకులు, అధికారులు తమ చేతులను శుభ్రం చేసుకోవడానికి నీరు, సబ్బు, శానిటైజర్ ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి సెంటర్లో కొవిడ్ నిబంధనలు
కొనుగోలు కేంద్రానికి వచ్చే ప్రతి ఒకరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కరోనా నిబం ధనలు, ప్రభుత్వ మద్దతు ధర తెలియజేసే ఫ్లెక్సీలనూ తయారు చేసి సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో వరికోతలు ఊపందుకోవడంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, శాయంపేట, పరకాల, దామెర తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో సుమారు 60సెంటర్లను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు వెల్లడించారు. గురువారం వరకు 34 కేంద్రాల్లో 497 మంది రైతుల నుంచి 3,666 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు ప్రకటించారు. దీని విలువ 6.92 కోట్లు. కొన్న ధాన్యంలో 2,863 టన్నులను రైస్మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని సీఎంఆర్ పద్ధతిన 49 రైస్మిల్లులకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మిల్లులకు ఏడు సెక్టార్ల ద్వారా ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు ధాన్యం రవాణా చేస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటుండడం వల్ల రైతులకు మద్దతు ధర దక్కుతుంది. క్వింటాల్ ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,880, కామన్ ధాన్యానికి రూ.1,868 చొప్పున లభిస్తున్నది.