శుకఉవాచ- రాజా! ఔత్తరేయా! ఉత్తరుని- బాలకృష్ణ రూప విష్ణుని లోకోత్తర అనుగ్రహం పొందిన నలకూబర మణిగ్రీవులు ప్రదక్షిణ పూర్వకంగా పరమాత్మునికి పదేపదే ప్రణమిల్లి ఉత్తరదిక్కుకు ప్రయాణమయ్యారు. పిమ్మట నందుడు మొదలైన పెద్దలు మద్దులు విరిగిపడ్డ పెద్ద చప్పుడు విని, పిడుగు పడ్డదేమోనని భయపడి వడివడిగా వచ్చి చూశారు.
పిడుగుపాటు లేదు, ప్రభంజనం- పెనుగాలి పోటూ లేదు, గొడ్డలి వేటు గుర్తులూ లేవు. పోనీ, ఈ పసివాడే చెట్లను పడదోశాడనటం కూడా పాడి కాదు. ఇంతకీ చెట్లు ఎలా కూలిపోయాయో అంతుచిక్కడం లేదు. ఇది చాలా వింతగానే ఉంది. ఇలా పలువురు పలు విధాలుగా పలుకుతూ ఉండగా, అక్కడే ఆడుకుంటున్న చిన్నపిల్లలు, తాము కనులారా కన్నదాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారికి విన్నవించారు. పిల్లలు కల్లలాడుతున్నారని పెద్దలెల్లరూ సంశయించారు.
నందుడు మాత్రం తన తనయుడు క్షేమంగా ఉన్నందుకు అమందానంద భరితుడై ఆత్రపడుతూ నందనుని- కుమారుని బంధనాన్ని విప్పేశాడు. అప్పుడు లీలావినోది అయిన కృష్ణుడు ఈ ఘటన నుంచి గోకులవాసుల మనస్సులను మరలించి, మభ్యపెట్టి- మోసపుచ్చడానికి బాలుని వలె నటించసాగాడు. పరమార్థంలో… భగవంతుని బంధించగలది భక్తి మాత్రమే! విడిపించ గలవాడు కూడా భాగవతుడు- భక్తుడు మాత్రమే! యశోద భక్తి, నందుడు భక్తుడు.
వేదాంతపరంగా.. ‘ఆత్మాత్వం గిరిజామతిః’ తల్లి బుద్ధి- ప్రకృతి, బంధనం తగిలించింది. ఎలా? జీవునికి బంధనమనేది స్వతహాగా- స్వరూపంలో లేదు. ఎందుకని? ‘జీవో దేవః సనాతనః’- పారమార్థికంగా జీవుడు కూడా దేవుడే కనుక. మరి బంధనమేమిటి? అది బుద్ధి యొక్క ఆరోపణ (లేనిదాన్ని మోపుట) మాత్రమే! తండ్రి- పురుషుడు, ఆత్మ. అనగా గురువు.
(ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే). ఆయన (నందుడు) బంధనాన్ని అపవదించాడు- తొలగించాడు, తోసిపుచ్చాడు. మరో విశేషం.. ప్రపంచం పరమాత్మ చేతిలో కీలుబొమ్మ. కాని, ప్రస్తుతం ఆ పరబ్రహ్మ బాలకృష్ణుని రూపంలో గోకులవాసుల చేతిలో తోలుబొమ్మ! శ్రీకాంతుడు గోపకాంతల సమక్షంలో, బమ్మెరవారి మాటలో ‘జంత్రము కైవడిన్’ ఒక యంత్రంలా దిమ్మతిరిగేటట్లు ఆట బొమ్మలా అమాయకంగా ఆడుతున్నాడు, పాడుతున్నాడు…
శా॥ ‘పాడున్ మందుని భంగి గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా
నాడున్ జంత్రము కైవడిం బరవశుండై హస్తముల్ ద్రిప్పుచుం
జూడన్నేరని వాని భంగి జనులం జూచున్ నగున్ బాలురం
గూడుం బెద్దల పంపు సేయఁ జనుడాగున్ మట్టి జిట్టాడుచున్’
‘రాజా! ఆ యశోదపట్టి తన చుట్టూ ఉన్నవారిని కూడా గుర్తుపట్టలేని వానివలె చిత్రంగా చూస్తూ, నవ్వుతూ తోడి పిల్లలతో కూడి గంతులు వేస్తాడు. పెద్దలు ఏమైనా చెబితే బుద్ధిమంతుని వలె చేస్తాడు. చాటుమాటున దాక్కుంటాడు. మట్టిలో తిరుగుతూ ఆడుకుంటాడు’. వెయ్యేల? ఆ నల్లవాడు తన పిల్లచేష్టలతో గోకులవాసుల సుఖశాంతులనే గంపను అనుకంప (కరుణ)తో ఇంపుగ నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడట! ఇదీ ప్రేమాభక్తి మహిమా శక్తి!
బాలగోపాలుని నందగోకుల లీల ఇక్కడికి ముగిసింది. ఇక బృందావన లీల ప్రారంభమవుతుంది. శుకుడు- మహారాజా! మురిపాల బాలకృష్ణుడు ఐదు సంవత్సరాల వాడయ్యాడు. అతనికి బృందావనం చేరాలని కోరిక కలిగింది. బృహద్వనం (గోకులం)లో బలరామకృష్ణులకు ఉపద్రవాలు కలుగుతున్నందున, బృందావనానికి మకాం మార్చాలని వృద్ధ గోపకుడు ఉపనందుడు దైవ సంకల్పంగా ఇచ్చిన సలహాను నందాదులందరూ అంగీకరించారు. భక్తివనమే బృందావనం! బృందావన మనగా నిజానికి బృహదారణ్యక ఉపనిషత్తే!
క॥ ‘చెందిరి బలమాధవులభి
నందించుచు బరమ పావనము సంచిత కా
ళిందీ సంజీవనమున్
బృందావనమున్ మునీంద్ర బృందావనమున్’
బలరామకృష్ణులు ప్రేమోత్సాహాలతో పరమ పావనమైన బృందావనం ప్రవేశించారు. ఆ బృందావనం కాళిందీ (యమున) నదికే ఉజ్జీవనంగా- జీవం పోసినట్లుగా ఉంది. మునీంద్రుల బృందాలను- సమూహాలను కాపాడేదిగా అలరారుతోంది. బృందావనం చేరి రామకృష్ణులు తమ ఈడు పిల్లలతో కలసి వేడుకగా దూడలను కాయసాగారు. యమున కృష్ణభక్తికి ప్రతీకం- చిహ్నం. ఆ తీరంలో కూడా గోపబాలురకు రెండు బాధలు దాపురించాయి- వత్సాసుర, బకాసురులు.
వత్సాసురుడు అజ్ఞానానికి, అంధ విశ్వాసానికి ప్రతీకం. కాగా, బకాసురుడు దంభా(డంబా)నికి సంకేతం. పవిత్రమైన భక్తిలో దంభం వచ్చిచేరితే అది అపవిత్రమవుతుంది. దంభాన్ని మించిన దారుణమైన పాపం మరొకటి లేదు. పరమాత్మ గీతలో అసుర గుణాలను లెక్కిస్తూ మొదటగా ‘దంభో దర్పోభిమానశ్చ’ అంటూ దంభాన్నే పేర్కొన్నాడు. ఇతర పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయికాని దంభానికి, కృతఘ్నతకు నిష్కృతి- ప్రాయశ్చిత్తం లేదు. వేషభాషలు ధార్మికంగా ఉండి లోపల ఈర్ష్యాద్వేషాలు, దుర్భావాలు ఉన్నవాడు బకాసురుడు- బక(కొంగ) రూప అసురుడు.
శుకయోగి- రాజా! ఒకనాడు బలరామకృష్ణులు యమునాతీరంలో దూడలను కాయుచుండగా కంసుని పంపున వచ్చిన, ఆయువు తీరిన ఒక రాక్షసుడు వత్సాసురుడు వారిని వధించడానికి కోడె దూడ రూపంతో దూడల్లో కలిసిపోయాడు. వాణ్ని గుర్తించి బాలగోపాల మణి వాని కాళ్లు, తోక కలిపి పట్టుకొని, పైకెత్తి పెద్ద పెట్టున ఒక వెలగ చెట్టుకేసి కొట్టాడు. వాడు గిలగిల కొట్టుకొని ప్రాణాలు విడిచిపెట్టగా గోపబాలురందరూ ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేశారు. గొంగళ్లు ఎగరేశారు.
ఎగిరి దూకుతూ చప్పట్లు కొడుతూ త్రుళ్ళింతల- మిడిసిపాటులతో పొంగిపోయారు. వేల్పులు- దేవతలు విరుల (పూల) వానలు కురిపించారు. ‘వత్సముల మేపుచుండియు వత్సాసురు జంపె భక్తవత్సలు డధిపా!’- భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే చిన్నికృష్ణుడు వత్సము(దూడ)లను మేపుతూ కూడా దుర్మార్గుడైన వత్సాసురుని సంహరించాడు.
రాజా! ఒకనాడు గోపబాలురందరూ ఒక కొలనులో దాహం తీర్చుకొని మరలి వస్తుండగా కొండ శిఖరమంత ఒక కొంగను కనుగొన్నారు. అది కృష్ణుని చంపడానికి వచ్చిన బకాసురుడనే దొంగకొంగ.
ఆ॥ ‘ఎల్లపనుల మాని యేకాగ్ర చిత్తుడై
మౌని వృత్తి నితరమతము విడిచి
వనములోన నిలిచి వనజాక్షు పై దృష్టి
జేర్చి బకుడు దపసి చెలువు దాల్చె’
ఆ కొంగ మరో పని ఏదీ చేయకుండా బాలకృష్ణుని మీదే బుద్ధి నిలిపి, ఆ అడవిలోని కొలనిలో మునివలె తడబాటు లేక- నిశ్చలంగా నిలబడి ఉంది. దాని మనసులో మరో ముచ్చటే లేదు. విరోధంతో కృష్ణుని చంప తలచినా దాని మనసుకు నిరోధం (మనోలయం, అమనస్కత) కలిగి, ఆ ప్రయత్నంలో దానికి మహర్షులకు యోగ్యమైన తపస్సు సిద్ధించింది. ఇట్టి నిశ్చలమైన (ధ్యానం హి నిశ్చలా బుద్ధిః) బుద్ధికే ధ్యానమని పేరు. రాజా! ఆ టక్కుల మారి కొక్కెర- కొంగ, ఒక్కపెట్టున నందపట్టి (కృష్ణు)ని ఒడిసిపట్టి ముక్కుతో మింగేసింది.
బలరామాదులు భయంతో కంపించి ప్రాణంలేని ఇంద్రియాల వలె నిశ్చేష్టులయ్యారు. అయితే, అన్నీ తెలిసే వన్నెచిన్నెల ఆ దొంగ కన్నయ్య కొంగ చేత మింగుడుపడ్డాడు. నిప్పుముద్దలాగా బకాసురుని కంఠానికి అడ్డుపడి వానికి ముప్పతిప్పలు పెట్టాడు. మింగలేక ఆ కొంగ కృష్ణుని బయటికి వెళ్లగక్కింది. మంగళ స్వరూపుడైన శ్రీహరి కలహానికి కాలుదువ్వే ఆ కొంగ ముక్కు రెండు భాగాలను రెండు బాహువులతో పట్టుకొని గడ్డిపరకను చీల్చినట్లు భీకరంగా అవలీలగా నిలువునా చీల్చివేశాడు. కంస సఖుడైన బకుని, అఖిల జీవ అంతర్యామియైన కృష్ణస్వామి తనలో లీనం చేసుకున్నాడు.
దేవతలు పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభిధ్వనులు వినిపించాయి. ‘బ్రతికి వచ్చావా కృష్ణా’ అంటూ గోప కుమారులంతా సంతోషంగా అతనిని కౌగిలించుకున్నారు. భక్తి బాహ్య చిహ్నాలు ధరించి భక్తులుగా లోకులను నమ్మించడానికి తిప్పలు పడేవారు సర్వవిధాల వ్యభిచారులు. వారు ముప్పును కొని తెచ్చుకున్నవారే అవుతారు. ‘దంభేన హీనః క్రియతే స ధర్మః’- దంభరహితంగా చేసే దాన, ధ్యాన, పూజా, ధర్మోపదేశాది కర్మలే నిజమైన ధర్మం. అంభోజాక్షుని- విష్ణుని కరుణలేనిదే అంతఃకరణంలో దాగి ఉన్న దంభా(బకా)సురుడు నశించడు!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006