తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రారంభించిన ఉత్తర ద్వారా దర్శనం సోమవారంతో ముగియనున్నది. డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైన ఉత్తర ద్వార దర్శనం 10 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. ప్రతిరోజు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాములు రోజుల్లో ఉండే సర్వదర్శనాన్ని రద్దు చేసి ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక టోకెన్లు ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 8లక్షలకు పైగా టోకెన్లు జారీ చేసి అందుకనుగుణంగా ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రితో ఉత్తర ద్వార దర్శనం ముగుస్తుండడం వల్ల మంగళవారం తెల్లవారుజాము నుంచి సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.
నిన్న స్వామివారిని 63, 728 మంది మంది స్వామివారిని దర్శించుకోగా 19,206 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.