TTD News | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో గణపతి హోమంతో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూదితో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతిపూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి జరిపారు.
అలాగే, శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ సుబ్రమణ్య స్వామి హోమం జరుగనున్నది. అక్టోబరు 30న సాయంత్రం 5.30 గంటలకు సుబ్రమణ్య స్వామి కల్యాణం నిర్వహిస్తారు. అక్టోబరు 31న శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం, నవంబరు 1న శ్రీ కాలభైరవ స్వామి హోమం, నవంబరు 2న శ్రీ నవగ్రహ హోమం, నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం), నవంబరు 12 నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామి హోమం (రుద్రయాగం), నవంబరు 22న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు. నవంబరు 23న శ్రీ చండికేశ్వరస్వామి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల ఆరాధన నిర్వహిస్తారు.
గృహస్తులు రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామి క్షేత్రంలో జరిపే హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.
ఎల్లుండి పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
అక్టోబరు 29వ తేదీన నాగులచవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీ మలయప్పస్వామి ఉభయ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శమిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవల్లో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆని అర్చకులు వెల్లడించారు. పెద్దశేష వాహన సేవ రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ జరుగనున్నది.