మనిషి జీవితమే ఓ మహాభారతం. గుప్పెడంత మెదడు.. రణక్షేత్రమైన కురుక్షేత్రం. భయాలూ, బాధలూ, ఆశలూ, నిరాశలూ.. అక్షౌహిణుల కొద్దీ శత్రు సైన్యం. బతుకు యుద్ధం చేయలేక, బాధ్యతల విల్లంబులు విసర్జించే నరజనమంతా.. నారాయణుడి ఉపదేశం కోసం ఎదురుచూసే పాండవ మధ్యముడికి ప్రతీకలు. ధర్మ సంస్థాపనార్థం యుగయుగంలో సంభవించే సర్వోన్నతుడు.. కలియుగ పార్థుల కోసం భగవద్గీతావతారం ధరించాడు. అనంత కరములు, అనంత ఆయుధములు, అనంత రూపాలతో కాకుండా.. అక్షర మూర్తిగా, గ్రంథ రూపంలో సాక్షాత్కరించాడు. పద్దెనిమిది అధ్యాయాల పరిపూర్ణ స్వరూపంతో.. సంకట స్థితిలో ఉన్నవారికి సన్మార్గం బోధిస్తున్నాడు.
గోవులను పాలించాడు. లోకాలను ఉద్ధరించాడు. గీత బోధించి రాత మార్చాడు. జగద్గురువయ్యాడు. ఎంతటివాడైనా.. ఎవరు ఎలా పిలిచినాపలుకుతాడు. ఏమిచ్చినా స్వీకరిస్తాడు. ఏ విధంగా కొలిచినా అనుగ్రహిస్తాడు. ఆ దేవదేవుడి అవతారం ధర్మస్థాపనకు శ్రీకారం. త్రిజగన్మోహనమైన ఆ దివ్యసుందర స్వరూపాన్ని మనసులో నిశ్చలం చేసుకుందాం. వేణుగాన తరంగాల్లో ఓలలాడుదాం. అంతరంగంలోని అగాధాలను పూడ్చుకుందాం. బృందావనవిహారి బంధువర్గంలో చేరిపోదాం.
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా
అసితో దేవలోవ్యాసః స్వయం చైవ బ్రవీషిమే॥ (భగవద్గీత 10- 12,13)
‘నీవే పరబ్రహ్మానివి, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చేవాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి, అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు’ అని అర్జునుడు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. ఇంతకూ కృష్ణుడిని అంతగా కీర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? ఏది శ్రీకృష్ణ స్వరూపానికి ప్రత్యేక విశిష్టతను చేకూరుస్తుంది? భగవంతుడు సర్వాకర్షితుడని అందరికీ తెలుసు. సమస్త విశ్వాన్నీ ఆకర్షించగల జగత్-మనమోహనుడు అతడు. ప్రతిఒక్కరినీ మోహింపజేసే శ్రీకృష్ణునిలోని ఆ ప్రత్యేక గుణములేమిటి?
దివ్య గుణాల సంపన్నుడు
వైదిక శాస్ర్తాలు, పురాణాలు, వేదాంత సూత్రాలు శ్రీకృష్ణుని విశిష్ట గుణాలను క్రమబద్ధంగా విశదీకరిస్తూ భగవత్తత్వాన్ని బోధిస్తున్నాయి. ఆ సమస్త శాస్ర్తాలను సంపూర్ణంగా అధ్యయనం చేసిన శ్రీల రూప గోస్వాముల వారు ‘భక్తిరసామృత సింధు’ అనే గ్రంథంలో శ్రీకృష్ణుని ప్రత్యేక గుణములే వారికి సర్వాకర్షితునిగా విశిష్ట స్థానాన్ని ఆపాదిస్తున్నాయని తెలిపారు.
సర్వాద్భుత చమత్కార లీలా కల్లోల వారిధిః
అతుల్య మధుర ప్రేమ మండిత ప్రియ మండలః
త్రీజగన్మానసాకర్షి మురళీ కళ కూజితః
అసమానోర్ధ్వ రూప శ్రీ విస్మాపిత చరాచరః
ఈ అరవై దివ్య గుణాలను మించి నల్లనయ్యలో మరో నాలుగు ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అవి, మహాసముద్రంలోని అలల వలె తన దివ్యలీలా తరంగాలతో ముల్లోకాలనూ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్త గలవాడు, దివ్యమాధుర్య ప్రేమ కలాపాల్లో తన చుట్టూ నిత్యం అసమతుల్యమైన భక్తిప్రపత్తులు కలిగిన విశుద్ధభక్తులను కలిగిన వాడు, తన మధుర వేణుగానంతో ముల్లోకాలను ఆకర్షించువాడు, తనతో సరిపోల్చుటకు వీల్లేని సౌందర్య, ఐశ్వర్యాలను కలిగిన వాడు శ్రీకృష్ణుడు. ఆయనతో సమమైన వారు కానీ, అధికులుగానీ మరొకరు లేరు. ఆ దేవాదిదేవుడు సమస్త చరాచర జీవకోటిని విస్మయపరుస్తాడు. అత్యంత సుమనోహర సుందరమూర్తియైన ఆ దివ్య స్వరూపానికే కృష్ణా అని పేరు. ఆధ్యాత్మిక ధామంలోని భక్తులు భగవంతునితో తమకున్న పరస్పర ప్రేమ, భక్తిరస భావనలతో అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ప్రతి
ఒక్కరూ పరిపూర్ణ సంతృప్తితో నిత్యమూ ఆనందంగా జీవిస్తారు.
స్వయంగా అవతరించే దైవం
భగవంతుడిని తన ధామంలోని భక్తులు ప్రేమతో, ఆనందంతో సేవిస్తుండగా, ఇక భగవంతుడు ఈ లోకంలో అవతరించాల్సిన పనేముంది? భగవంతుడు ఈ లోకానికి ఎన్నడూ రాడని చెబుతుంటారు కొందరు. భగవంతుడు కేవలం తన ప్రతినిధిని మాత్రమే ఈ లోకానికి పంపిస్తాడని చెబుతుంటారు మరికొందరు. ఆ విధంగా భగవంతుని అవతరణ అనేది ఎందరికో పాలుపోని విషయం. దేవుడు ఈ లోకంలో అవతరించగలడని, ఆయన సర్వ సమర్థుడని అర్థం చేసుకోవడం అల్ప మేధస్సులకు దిగ్భ్రాంతి కలిగించే అంశమే. ఈ విషయాన్నే శ్రీకృష్ణుని మేనత్త కుంతీదేవి భాగవతంలో ఇలా పలికింది..
జన్మ కర్మ చ విశ్వాత్మన్నజస్యాకర్తురాత్మనః
తిర్యఙ్నృషిషు యాదఃసు తదత్యన్తవిడమ్బనమ్
‘ఓ విశ్వాత్మా! నీవు అకర్తుడవైనప్పటికీ కర్మ నిర్వహించడం, అజుడవైనప్పటికీ జన్మించడం దిగ్భ్రమ కలిగిస్తున్నది. జంతువులు, నరులు, రుషులు, జలచర రూపాల్లో స్వయంగా నీవే అవతరిస్తున్నావు. నిజంగా ఇది సంభ్రమానికి కారణం అవుతున్నది’ అని కృష్ణుడిని కీర్తించింది కుంతీదేవి.
భగవంతుడు సకల జీవరాశుల్లోనూ అవతరించగలడు. స్వయం సంపూర్ణుడైన భగవంతునికి ఆనందం కోసం ఇతరుల సాయం అవసరం లేకున్నా, ఈ లోకంలోని బద్ధజీవులను ఉద్దరించి సన్మార్గాన్ని చూపేందుకే ఇక్కడ అవతరిస్తుంటాడు. ఒక్క మానవుల మధ్యే గాక, జంతు, జలచరాలు మొదలైన జీవరాశుల్లోనూ భగవానుడు అవతరిస్తుంటాడు. ఇదే శ్రీకృష్ణుని అనంత కారుణ్యం.
సంకీర్తనతో అర్చిద్దాం
బ్రహ్మదేవుని కాలగమనం ప్రకారం వారి ఒక రోజులో ఒక్కసారి శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరిస్తాడు. ఈ అరుదైన సందర్భాన్నే శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకొంటాం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని పునఃస్థాపించేందుకు కన్నయ్య అవతరిస్తాడు. జీవుడు భగవంతునితో తనకు గల సంబంధాన్ని పునఃస్థాపించుకోనిదే ఆనందంగా జీవించలేడు. అది కేవలం శ్రీకృష్ణుని పట్ల విశుద్ధ భక్తియుత సేవల ద్వారానే సాధ్యం. ఆ సర్వాకర్షకుడైన శ్రీకృష్ణుడిని ఏ విధంగా సేవించగలమో తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఆయన భక్తులైన ఆచార్యులను ఆశ్రయించాలని భగవద్గీత సూచించింది. ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు మనమంతా భగవంతుడిని ఆశ్రయించి, వారిని సేవించి వారి సన్నిధానాన్ని చేరే సరళమైన మార్గాన్ని ఉపదేశించారు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఈ మహామంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా కృష్ణానుగ్రహం లభిస్తుందని శ్రీల ప్రభుపాదుల వారు సూచించారు. ప్రతిరోజూ కనీసం 16 మాలలు జపించడం వల్ల నల్లనయ్య చల్లని చూపులు ప్రసరిస్తాయని సూచించారు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ
93969 56984