Tirumala | ఈ నెల 28 తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొంది. 29న వేకువ జామున 1.05 గంటల నుంచి తెల్లవారుజామున 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.
అయితే, గ్రహణ సమయానికి ఆరు గంటలు ముందుగా ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. గ్రహణం పూర్తయ్యాక తెల్లవారు జామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ ద్వారా తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉండనున్నాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది.