TTD | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు బుధవారం అమ్మవారు రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది.
అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం జరిపారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్సేవ జరగనుంది.
అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, విఎస్వోలు మనోహర్, బాలిరెడ్డి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరిండెంట్ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.