ఒక ఊర్లో రాములవారి గుడి దగ్గర హరికథను ఏర్పాటు చేశారు. రామాయణంలోని సుందరకాండను భాగవతార్ చాలా చక్కగా వర్ణించి చెప్పాడు. సీతమ్మ కష్టాలు విన్న ఊరి జనం కళ్లల్లో నీరు పెట్టుకున్నారు. హరికథ ముగింపు దశకు చేరింది. కళాకారులకు, నిర్వాహకులకు భోజనం ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయం తెరపైకి వచ్చింది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక మహిళకు తమ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. అయితే ఇంట్లో తగినన్ని సరుకులు ఉన్నాయో లేదోనని అనుమానం వేసింది. కోడలికి ఎలాగోలా చెప్పి వంటలు చేయిద్దామని గబగబా ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె వెనుకే ఊరి పెద్ద కూడా వాళ్ల ఇంటికి వెళ్లాడు. కోడలు పొయ్యి మీద పాలు కాస్తున్నది. భోజనాల విషయం చెప్పింది అత్త. మర్యాదస్తురాలైన కోడలు ఊరి పెద్ద ముందు ఇంటి గౌరవం తగ్గించరాదని భావించింది. ఇంట్లో సరుకులు అంతంత మాత్రమే ఉన్నాయన్నట్లుగా ఒక పాత్రనిండుగా వేడి పాలు పోసింది.
ఎక్కువ మంది వస్తే పాత్రలో పాలు పట్టవన్నట్లుగా తెలియజేసింది. ఉన్న సరుకులు ఇంట్లోవాళ్లకి మాత్రమే సరిపోతాయన్న విషయం అత్తకి అర్థమైంది. అయితే, ఉన్న సరుకులతోటే వంట చేస్తే అందరం సర్దుకుని తిందామని కోడలికి చెప్పాలనిపించింది అత్తకి. కానీ, ఇంటి గుట్టు ఊర్లో వాళ్లకి తెలియడం ఇష్టం లేక, చిన్నగా చక్కెర డబ్బా దగ్గరకు వెళ్లింది. చక్కెర కొంచెం తీసి పాలలో వేసింది అత్త. చక్కెర కలిపినంత మాత్రాన పాల పరిమాణం పెరగదని, ఇంకా చక్కటి తియ్యదనాన్ని ఇస్తుందని తెలుసుకుంది కోడలు. క్షణాల్లో సిద్ధం చేస్తానని బదులిచ్చింది. ఇదంతా గమనించిన ఊరి పెద్ద మనసులోనే వారిద్దరినీ అభినందించాడు. కార్యక్రమం పూర్తయ్యాక కళాకారులు, నిర్వాహకులు వచ్చి ఆ ఇంట్లో రుచికరమైన భోజనం చేశారు. తనకు మాత్రమే తెలిసిన అత్తాకోడళ్ల గొప్పతనాన్ని గుర్తించాలనిపించింది ఊరి పెద్దకు. వంటలు చక్కగా ఉన్నాయని ప్రశంసిస్తూ అత్తాకోడళ్లను దుశ్శాలువాతో సత్కరించాడు. అత్తాకోడళ్లకు ఆనందంతో మాటరాలేదు.