శ్లో॥ అజాత మృత మూర్ఖాణాం వర మాద్యౌ న చాంతిమః,
సకృద్దుఃఖకరా వాద్యా వంతిమస్తు పదేపదే.
పుట్టని వాడు, పుట్టి గిట్టిన వాడు, మూర్ఖుడు- ఈ ముగ్గురిలో మూడవ- అనగా మొరటువాని కంటే మొదటి ఇద్దరే మేలు చేకూర్చే మంచివారు. ఎందుకని? వీరు జీవితంలో ఒక్కసారే ఏడిపిస్తారు. కాని, మూర్ఖుడు బ్రతికినంత కాలం, రేయింబవళ్లు బాధ పెడుతూనే ఉంటాడు. భాగవతంలో తపఃపూతుడైన భక్తికవి పోతన పలికిన పూతరేకుల వంటి భక్తి మాధుర్య భరితమైన ఆపాతరమణీయ,ఆలోచనామృత పద్యగద్యాలను పఠించి పరవశించే భావుక భక్తులు నేటికీ ఎందరో! ఆ మహానుభావులందరికీ వందన చందనాలు!
కం॥ ‘నాకిపుడెఱిగింపుము సు
శ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులం
బైకొని జుఱ్ఱియు దనివిం
గైకొనకున్నది మనంబు గరుణోపేతా!’
కల్యాణాత్మకమైన కృష్ణ కథలు వినడంలో విసుగు, విరామం ఎరుగని విశేష తృష్ణ కలిగిన విదురుడు, మహనీయుడైన మైత్రేయ మహర్షిని- ‘మునీంద్రా! మనోవ్యథలను మరపించి మానిపించే పుణ్య శ్లోకుడైన పురుషోత్తమ పరమాత్ముని కథా పీయూషం (అమృతం) చెవులనే దోసిళ్లతో ఎంత తాగినా నాకు తగిన తృప్తి కలగడం లేదు, తనివి తీరడం లేదు. విమలమతీ! విష్ణుభక్తుడైన ధ్రువుని అశేషమైన వంశ విశేషాలు వివరించ’మని వినుతించాడు. ఆ మహాత్ముడు, ధ్రువుని వంశంలో మరో ధ్రువతారగా వెలిగే, చక్రధారి మహావిష్ణువు యొక్క అంశావతారమైన ‘పృథు’ చక్రవర్తి విచిత్ర, పవిత్ర చరిత్రను విన్నవించాడు.
మైత్రేయ ఉవాచ- విదురా! ధ్రువుని వంశంలో జన్మించిన ‘అంగుడు’ అనే పేరుగల అవనీపతికి (రాజశ్రేష్ఠునికి) చాలా కాలం వరకు సంతతి కలగలేదు. యజ్ఞ పురుషుడైన వెన్ను (విష్ణువు)ని ఆరాధించగా ఆ రాజచంద్రునికి ‘వేనుడు’ అనే కుమారుడు కలిగాడు. కాని వాడు అన్ని విధాల అత్యంత హీనుడయ్యాడు. వేనుని మాత సునీథ మృత్యువు కూతురు కావటం వలన మనుమడికి తాత బుద్ధులే తారసిల్లినై. (ఇక్కడ మృత్యువు అంటే అధర్మ వంశంలో పుట్టినవాడు. అంతేకాని ధర్మరూపుడైన ‘మృత్యుదేవత’ కాదు.) కిరాతుని వలె క్రూరుడై, పాపపు మార్గంలో సంచరిస్తూ సర్వులకూ సర్వదా మనస్తాపాన్ని కలిగిస్తున్న కన్నకొడుకును అంగరాజు ఎన్నో విధాలుగా దండించి కూడ భంగపడ్డాడు. పాత్రత (యోగ్యత) లేనివానిపట్ల మన ప్రయత్నాలు ఫలించవు. బకము (కొంగను)ను తెచ్చి ఎంత నేర్పినా శుకము (చిలుక) వలె పలుకలేదుగా! అన్ని యత్నాలు వ్యర్థం కాగా ఖిన్న హృదయుడై ఇలా విలపించాడు.
‘ఇలాంటి కుపుత్రుని కనటం, కలకాలం కుమిలిపోతూ మనటం కన్నా, బిడ్డలు లేకపోయినా భూమిమీద బ్రతికినంత కాలం పరువుతో, ఆదరువు బ్రతికి చనటం బహుభంగుల బాగైన బ్రతుకు కదా! విచారించగా వైరాగ్యం కలిగించే కుపుత్రుడు కలగటమే, కేశవ భగవానుని కరుణగా కనిపిస్తోంది. అదే మంచివాడైతే మోహాన్ని పెంచి, వైరాగ్యాన్ని త్రుంచి, మాయా సంసారంలో ముంచుతాడు. ఇక ఆ బంధనాలు తెంచుకోవడం ఇంచుకైనా సాధ్యం కాదు’ ఇలా విచారించి విజ్ఞానవంతుడై ఒకనాటి అర్ధరాత్రి అంగుడు అంతా వదిలించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ పద్యంలోని నాల్గవ పంక్తిలో అమాత్యుడు అమూలకమైన అమూల్య భావాన్ని చేర్చి కందానికి సహజమైన అందాన్ని కూర్చాడు. ఈ ప్రసంగంలో ప్రథమంగా పుత్ర సంతానం లేకపోవడం, పుత్రుని పొందాలనే అనుతాపం, తర్వాత ప్రారబ్ధఫలంగా కుపుత్ర ప్రాప్తి, వానిమీద మాతామహుని (తల్లితండ్రి) ముద్ర- స్వభావ ప్రభావం, దానివలన భరించలేని మనస్తాపం, అన్నిటిని మించి ఆఖరికి వీటన్నింటిలో విష్ణుదేవుని విశేష కృపను వీక్షించి వైరాగ్యం పొందటం- ఇవన్నీ మానవునికి ముక్తి కలిగించే జ్ఞాన, వైరాగ్య భిక్షా శిక్షా స్మృతులు!
ఇక రాజులేని రాజ్యంలో అరాజకత్వం రాజ్యమేలింది. పశువుల వలె ప్రవర్తిస్తున్న ప్రజలను చూచి మంత్రులు, పురోహితులు, మునులు అయిష్టంగానే దుష్టుడైన వేనునికి పట్టం కట్టారు. చండశాసనుడైన వేనుడు మత్తవేదండం (మదించిన ఏనుగు) వలె నిరంకుశంగా సంచరిస్తూ సజ్జనులను కించపరచేవాడు. యజ్ఞదానహోమాలను నిషేధించాడు. మునులు బోధించిన వేదధర్మాలను వేనరాజు తోసిరాజన్నాడు. తన అధర్మమే ధర్మమన్నాడు. ‘మునులారా! నేనే యజ్ఞనారాయణుడను, మగని మీద మమత లేని మాయలాడి మిఠారి రంకు మగనిపై వలపు ఒలకబోసినట్లు, మీరు కూడా మహారాజునైన నన్ను కాదని మరెవరిమీదనో మరులు (ప్రేమ) గొని మసలుతున్నారు. దేవతలంతా ధరణీపతి దేహంలోనే కొలువై ఉంటారు. కాన, భూపతియే భగవంతుడు. నన్నే సేవించండి. నాకే బలులు అర్పించండి’ అని శాసించాడు. యజ్ఞపతి అయిన ఇందీవర శ్యాముని, ఇందిరా రమణునే నిందించే ఈ నికృష్టుడు ఇక నేలమీద నిలువరాదని మునులు పెల్లుబికిన కోపంతో ఒక్కపెట్టున హుంకరించారు. ఆ హుంకారానికి అసుర అంతకుడైన విష్ణుని నిందించిన వేనుని ప్రాణాలు అనంతవాయువులో ఐక్యమైపోయాయి. సుతుని మరణానికి దుఃఖించిన సునీథ యోగశక్తిచే అతని శరీరాన్ని చెడిపోకుండా కాపాడింది. వేనరాజు మరణించగా రాజ్యంలో మరల అరాజకత్వం ఆరంభమైంది. పైశాచికత్వం ప్రబలింది. (సశేషం)
కం॥ అనయము నిట్టి కుపుత్రుని
గని పరితాపంబు బొందు కంటెను ధరలో
ననపత్యుండగు టొప్పును
వనజాక్షు భజించునట్టి వాడగు వాడున్
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006