ప్రకృతి ఒడిలో పవిత్రమైన రబీ ఉల్ అవ్వల్ మాసం వచ్చిందంటే చాలు, విశ్వప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) జన్మదినం మనకు గుర్తుకొస్తుంది. ఆ దేవుడు ఆయన్ని కేవలం అరబ్బుల కోసమో, లేదా ముస్లింల కోసమో ప్రత్యేకంగా పంపలేదు. యావత్ సృష్టికి, సమస్త లోకాలకు కారుణ్య ప్రదాతగా (రహ్మతుల్ లిల్ ఆలమీన్) ఆయనను లోకానికి పంపాడు. పవిత్ర ఖురాన్ చెబుతున్నట్లుగా ఆయన అంధకారంలో మగ్గుతున్న మానవాళికి దివ్య వెలుగును పంచే ‘సిరాజ్ అల్-మునీర్’ (ప్రకాశవంతమైన దీపం).
ఇస్లాం ధర్మం కేవలం కొందరి కోసమే పరిమితం కాదు; అది ప్రేమ, సహనం, సర్వసమ్మిళిత తత్వాల సమాహారం. ఈ సత్యాన్ని తన ఆచరణ ద్వారా చేసి చూపారు ప్రవక్త ముహమ్మద్. చిన్ననాటి నుంచి ఆయనలో ఉన్న సత్యసంధత, విశ్వసనీయత ఆయన్ని ‘అల్-అమీన్’ (నమ్మకస్తుడు)గా సమాజంలో నిలబెట్టాయి. ఒకసారి అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన సఫా పర్వతంపై నిలబడి, అరబ్ తెగలన్నింటినీ పిలిచి.. ‘ఈ పర్వతం వెనుక మీపై దాడి చేయడానికి శత్రు సైన్యం సిద్ధంగా ఉందని నేను చెబితే నమ్ముతారా?’ అని అడిగారు. అప్పుడు ఆ తెగలవారంతా ఏకకంఠంతో, ‘కచ్చితంగా నమ్ముతాం! ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడిన దాఖలాలు మాకు లేవు’ అని బదులిచ్చారు. అప్పటికి వారంతా ముస్లిమేతరులే అయినప్పటికీ, ప్రవక్త నిజాయితీ ముందు తలవంచారు.
మనుషుల మధ్య కుల, మత, వర్గ భేదాలను ప్రవక్త ఎప్పుడూ ప్రోత్సహించలేదు. దేవుని దృష్టిలో అందరూ సమానులేనని, ఎవరి గొప్పతనమైనా వారి ధర్మవర్తన, దైవభక్తి మీదే ఆధారపడి ఉంటుందని ఆయన ప్రబోధించారు. పవిత్ర ఖురాన్లోని అల్-హుజ్రాత్ అధ్యాయం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది: ‘ఓ మానవులారా! మిమ్మల్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ నుంచే సృష్టించాం. ఒకరినొకరు గుర్తించేందుకే జాతులుగా, తెగలుగా మలచాం. దేవుని దృష్టిలో అత్యుత్తముడు ఎవరంటే మంచి నడవడిక గలవాడే!’ ఈ విశాలమైన మానవతా దృక్పథమే ప్రవక్తను ముస్లిమేతరుల పట్ల మరింత హుందాగా నడుచుకునేలా చేసింది.
ఆయన చూపిన మానవత్వానికి చరిత్రలో నిలిచిపోయే మచ్చుతునక సంఘటన ఇక్కడొకటి ఉంది. ఒకనాడు ప్రవక్త తమ సహచరులతో కలిసి కూర్చుని ఉన్న సమయంలో అటుగా ఒక యూదుడి అంతిమ యాత్ర (శవయాత్ర) వెళ్లింది. వెంటనే ప్రవక్త మృతుడికి గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. అది చూసి ఆశ్చర్యపోయిన కొందరు సహచరులు, ‘అతను ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకి అయిన యూదుడు కదా.. ఆయన శవానికి గౌరవం ఇవ్వడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త ఇచ్చిన సమాధానం గుండెలను హత్తుకుంటుంది: ‘అది ఒక మానవ ఆత్మ కాదా?’.
ముస్లిమేతరులతో ప్రవక్త ప్రవర్తించిన ఈ అద్భుతమైన తీరే ఇస్లాం ధర్మాన్ని నలుమూలలా వ్యాపింపజేసింది. కేవలం కఠినమైన ఆచారాలు, సంకుచిత ధోరణులతోనే మతం బతికి బట్టకట్టలేదని నేటి ముస్లిం సమాజం గ్రహించాలి. ప్రవక్త ముహమ్మద్ ప్రదర్శించిన పరిపూర్ణ సత్యసంధత, నిజాయితీ, తోటి మనుషుల పట్ల సహాయ గుణం, విశాల దృక్పథం.. ఈ గుణాలన్నిటినీ మనం అలవర్చుకున్నప్పుడే సమాజంలో శాంతి, నిజమైన ఇస్లాం స్ఫూర్తి పరిమళిస్తాయి. మానవత్వమే అన్నిటి కన్నా మిన్న అనే సత్యాన్ని ఆచరణలో చూపడమే ప్రవక్తకు మనం అర్పించే నిజమైన నివాళి!
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076