ఓ సాయంత్రం ఆశ్రమంలో సత్సంగం జరుగుతున్నది. అక్కడికి అన్ని ప్రాంతాలకు చెందిన వారు వచ్చారు. వివిధ భాషలు మాట్లాడుతున్నారు. ఇంతలో ముందువరుసలో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ‘మా దేవుడు గొప్పంటే… మా దేవుడు గొప్ప…’ అని వాదించుకోవడం మొదలుపెట్టారు. చినికిచినికి గాలివాన అయినట్లు సమస్య పెద్దదైంది. గురువు వారి తీవ్రతను గమనించాడు. ముగ్గురినీ వేదిక పైకి పిలిచి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోమన్నాడు.
సభా ప్రాంగణం పక్కనే ఉన్న మల్లెచెట్టు నుంచి పిడికెడు పూలు కోసి వారి చేతికిచ్చాడు. కండ్లు మూసుకుని వాటి వాసన చూడమన్నాడు. మధురమైన మల్లెల పరిమళానికి వారు తన్మయులయ్యారు. గురువు వేదిక కింద కూర్చున్న వారికి చూపిస్తూ.. ‘ఇవేమిటి?’ అని అడిగాడు. ఉత్తరాదివారు ‘చమేలి’ అని గట్టిగా అరిచి చెప్పారు. ‘జాస్మిన్’ అని కొందరు యువకులు చెప్పారు. ‘మల్లిగె హూవు’ అన్నారు కన్నడిగులు. ‘మల్లెపూలు’ అన్నారు తెలుగువారు.
అందరినీ అడగటం పూర్తయ్యాక వేదికపైన ఉన్నవారిని మళ్లీ పూల వాసన చూడమన్నాడు గురువు. ‘పరిమళంలో ఏమైనా మార్పు ఉందా?’ అని ప్రశ్నించారు. ఏమీ లేదని చెప్పారు. ‘చూశారు కదా! మల్లెపూలను మనం ఏ పేరు పెట్టి పిలిచినా దాని అందం, రంగు, పరిమళం మారవు. ఏ దైవమైనా కోరుకునేది విశ్వ శ్రేయస్సే. కాబట్టి దేవుడిని ఏ పేరుతో పిలిచినా, కొలిచినా తప్పు లేదు. దైవత్వంలో ఎక్కువ తక్కువలు లేవు. ఏ పేరుతో పిలిచినా, దైవం తన అమృత హస్తం అందిస్తాడు’ అని వివరించాడు. భక్తులందరూ చప్పట్లు చరిచారు. వాదనలు చేసుకున్న ముగ్గురూ.. ‘నిజమే.. మనం మన ఆలోచనలతో విభజన రేఖలు గీసుకుని ఎవరి దేవుడు గొప్ప? అంటూ గొడవపడ్డాం’ అని పశ్చాత్తాపం చెందారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు 93936 62821