TTD news | కరోనా మహమ్మారి తిరిగి వ్యాపిస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రపంచ మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం నిర్వహించారు. ఈ మహాయాగం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు జరిపారు. ఈ యాగం శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో జరిగింది.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆదివారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ యాగంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొని గోపూజ జరిపారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కుంభారాధన, ఉక్తహోమాలు, కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం రుత్వికులను సన్మానించి తీర్థప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ లోకకల్యాణం కోసం చేసే ఇలాంటి యాగాల వల్ల అద్భుత ఫలితాలు అందుతాయన్నారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు అందాలని వారు ఆకాంక్షించారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో 18వ తేదీ వరకు 21 మంది రుత్వికులు 7 హోమ గుండాలలో యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్ తోపాటు పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.