శ్రీశుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! సంపన్నత- సిరిసంపదలు, కోల్పోయి విపన్నులైన విరించి ప్రముఖ విబుధులు- బ్రహ్మాది దేవతలు, ప్రపన్నులై- శరణాగతులై చేసుకొన్న విన్నపాన్ని ఆపన్న ప్రసన్నుడు పన్నగశాయి విన్నాడు. ప్రేమతో ప్రత్యక్షమై ఇలా అన్నాడు
‘వేల్పులారా! వినండి. కడలిపాలైన మీ సంపద వెలికి వెడలి రావాలంటే మీరు ఒడలు దాచుకొనక వడిగా క్షీరవారిధిని తరవండి. విలంబం (ఆలస్యం) చేస్తే పీయూషం కూడా విషమవుతుంది. కాన, శీఘ్రమే సుధను సాధించే సాధన ప్రారంభించండి. మరణం లేని మనుగడకు ఆయుష్షును పెంచే పీయూష పానమే ఏడుగడ- అనితర సాధనం. అయితే, సాగర మథనం అంత సులభం కాదు. కష్టసాధ్యమైన ఈ క్రియలో ఇష్టం లేకపోయినా దుష్టులైన దైత్యులతో సంధి గావించుకొని వారి సాయం కూడా స్వీకరించండి. లేకపోతే అభిమానవంతులైన అసురులు అపాయం- ఆటంకాలు కలిగిస్తారు. పాలకడలిలో పలువిధాలైన ఓషధులు, వనస్పతులు విరివిగా వెయ్యండి. మందరగిరిని మంథానం (కవ్వం)గాను, సర్పరాజు వాసుకిని తాడుగానూ చేసుకొని చిలకండి. నేనూ ఓ చేయి వేస్తాను. మీకు చాలా గొప్ప ఫలం చేకూరుతుంది.
పాపాత్ములైన పూర్వ దేవతలు (దానవులు) పలు కష్టాలపాలు అవుతారు. అలసట లేకనే మీరు అన్ని సంపదలు అందిపుచ్చుకొంటారు. వారిధిలో ఒక విషం పుడుతుంది. వెరచి (భయపడి) యత్నాన్ని విడవకండి. పయోధిలో పుట్టే పలు విశిష్ట వస్తువుల పట్ల ఆకృష్టులై (ఆకర్షితులై) ఇష్ట అయిష్టాలకు లోనుకాకండి. భయ ప్రలోభాలకు గురైతే అభయ రూపమైన అమృత సిరి మీ దరికి చేరదు.’ ఇలా అమరులను ఆదేశించి ఆద్యంత రహితుడు అచ్యుతుడు అంతర్ధానమయ్యాడు.
ఆదిదేవుని ఆజ్ఞను తలదాల్చి అమరులు సమరం మాట మాని అసురుల పట్ల సమరస భావంతో స్నేహం కనబరచారు. శచీపతి- ఇంద్రుడు తెలివిగల సచివుని (మంత్రి) వలె బలి చక్రవర్తి నాయకత్వాన్ని బేషరతుగా సమ్మతించాడు. సాగర మథన విధానం వివరించి సానుకూలం చేసుకొన్నాడు. అందరూ ఏకమై సుందర మందర పర్వతాన్ని పెకలించి అమందగతితో- వేగిరంగా సాగరతీరానికి మోసుకొస్తున్నారు. బలం చాలక బలి, బిడౌజా (ఇంద్రా)దులు కులగిరిని (మందరాన్ని) మధ్యలోనే కిందికి వదిలేసి కూలబడిపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోగా మరెందరో అంగాంగాలు విరిగి ఆక్రోశించారు. గిరి బరువై ఒరిగి పడినందున చేకూరిన కష్టాన్ని ఓర్వలేక సురాసురులు పరిపరివిధాల హరికి మొరపెట్టుకున్నారు.
వ్యాపకుడైన విష్ణువు వారి ఆపద ఎరిగి (తెలుసుకొని) పక్షిరాజుపై ఆసీనుడై దయతో ప్రత్యక్షమయ్యాడు. భయపడవలదంటూ కరుణామృతం నిండిన కటాక్షాలతో వీక్షించి వారందరినీ సలక్షణంగా రక్షించాడు. అండజపతి (గరుడుడు) ఆ పర్వతాన్నీ, పుండరీకాక్షుని మూపుపై దాల్చి కడలి గట్టుకు వచ్చి కొండను దించి నిండైన భక్తితో స్వామికి దండం పెట్టి అక్కడ ఉండకుండా తన విడిదికి వెళ్లిపోయాడు. వైనతేయుడు- గరుత్మంతుడు, ఉన్న ప్రదేశంలో జన్మవైరం వల్ల వాసుకి ప్రవేశించే వీలుండదు కదా! అంతరార్థపరంగా గరుడుడు ఛందోమయుడు, వేదరూపుడు అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణమైన శాస్త్ర అనుకూల ఆచరణ ఉన్నచోట వాసుకి రూపమైన ప్రపంచ వాసనలు ప్రవర్తిల్లే ప్రమాదం ఉండదు! ఇదే వ్యాసుని ‘సమాధి భాష’!
అమృతంలో పాలు పంచుతామని పాపరేడు (సర్పనేత) వాసుకికి ఆసపెట్టి దేవదానవులు మెల్లగా అతని మేను (దేహం) నిమిరి- దువ్వి కవ్వపు తాడుగా ఉండటానికి ఒప్పించారు. పాపం అతనికి ఘర్షణ వల్ల శరీరతాపం- నొప్పి కలగకుండా కొండను చదును-నునుపు చేశారు. పాలకడలిని కడవగా చేసి చిలకడానికి తలపడ్డారు. హరి, అమరులు ఉరగేంద్రుని- వాసుకి తలవైపు పట్టుకున్నారు. పెడతల మతులైన దానవులు విష్ణుమాయకు లోనై మేను (ఒళ్లు) తెలియని మైకంలో మొండిగా వితండవాదానికి దిగారు. మదోద్ధతులైన దైత్యుల ఉన్మత్త ప్రలాపాలు అనే కర్కశ కాకరుతా (కాకి అరుపు)లను కూడా, ‘స్వచ్ఛ, పుచ్ఛ, అచ్ఛ, ఇచ్ఛ, తుచ్ఛ’- ఇలా కఠిన ప్రాసను ప్రయోగించి పిక-కోకిల కల గీతాలుగా వినసొంపుగా వర్ణించిన పోతన కవి సత్తముని ఈ క్రింది ‘మత్తకోకిల’ వృత్తాన్ని (పద్యాన్ని) చిత్తగించండి. ‘కవి భావుక భావ్యమానం, తన్నాస్తి యన్న రసభావముపైతి లోకే’- కవి తన అలౌకిక భావనా సాగరం మథించి, అనురూప శబ్ద గ్రథనం ద్వారా వెలువరించిన విషయం ఎంత రసహీనమైనదైనా రసవంతమై సహృదయ హృదయరంజకంగా ఉండి తీరుతుంది…
మత్త॥ ‘స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కఁబట్టి మథింపఁగాఁ
బుచ్ఛమేటికి మాకుఁ బట్టఁగ? బూరుషత్వము గల్గి మే
మచ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికి? నిండు మాకు ఫణాగ్రముల్’
‘మీరు స్వచ్ఛమైన తలలు పట్టుకొని కులుకుతూ చిలుకుతుంటే, మేము తుచ్ఛమైన పుచ్ఛాన్ని- అమంగళమైన తోకను ఎందుకు పట్టుకోవాలి? ఇది మాకు పెద్ద తలవంపు- పరాభవం! పౌరుషం, తపం, వేదాధ్యయనం, కులం, బలం కలిగిన మేము త్రిదశు (దేవత)ల కన్నా ఏ విషయంలో పిన్నవారం? ఈ నీచమైన పనికి మేము పూనుకోం. మాకు పడగలివ్వండి. మీరే పాదాలు- తోక పుచ్చుకోండి.’ స్వపక్ష పక్షపాతి పుండరీకాక్షుని పరామర్శతో విబుధులు, తలలు విడిచి వినయంతో తోక పుచ్చుకున్నారు.
దితి సుతులు గర్వితమతులై అతిగా అరుపులు, కేకలతో అహి ఫణాలనే అందుకొన్నారు. ముందుముందు వాసుకి విషం కక్కితే కుందేది (బాధపడేది) పడగలు పట్టుకొన్న బృందారక (దేవతా)వైరులే కదా! జగన్నాథుడు అనుకూలమైతే ముజ్జగాలూ అనుకూలమే! ఈ ఘట్టంలో అడుగడుగునా ఆదిదేవుడు, అమృత స్వరూపుడు అయిన ‘అజిత’ భగవానుని ‘భక్త ఆనుకూల్యత’ ఎంతో అనర్గళంగా, అందంగా కనువిందు చేస్తుంది. వాస్తవానికి విష్ణు సహస్రం లోని ‘అనుకూలః’ అనే గరిష్ఠ నామానికి సరసమైన వరిష్ఠ వ్యాఖ్యానమే ఈ అమృత మథన ఉపాఖ్యానం!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006