తిరుమల : సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి ( Rath Saptami ) వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారని టీటీడీ ( TTD ) అధికారులు తెలిపారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.
వాహనసేవల వివరాలు
స్వామివారు తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం ఉంటుందని వివరించారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసి సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తామని వెల్లడించారు.