పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయచ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే॥
సకల ఐశ్వర్య ప్రదాత రాఘవేంద్రుడు. ఆయన కరుణా సముద్రుడు. సత్యధర్మాలను ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షంతోనూ, కామధేనువుతోనూ సమానంగా వరాలు కురిపిస్తాడు. మనసులో స్వామిని నిలుపుకొన్న వారికి ఐశ్వర్యం, యశస్సును అందిస్తారని రాఘవేంద్ర స్తోత్రం చెబుతుంది.
గురు రాఘవేంద్రులుగా మంత్రాలయంలో ఆయన చూపిన మహిమలు అనేకం. 1671లో శ్రావణ బహుళ విదియ నాడు సజీవ బృందావన ప్రవేశం చేశారు. యతిశేఖరుడి బృందావనం ఎన్నో అద్భుతాలకు కేంద్రమైంది. బ్రిటిష్ పాలనలో దత్త మండల కలెక్టరు థామస్ మన్రో.. మంత్రాలయ మఠానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి.. స్వామివారి బృందావన దర్శనానికి తీసుకెళ్లారు. మరుక్షణమే ఓ అద్భుతం జరిగింది. బృందావనం నుంచి సాక్షాత్తూ స్వామివారే వచ్చి.. మన్రోతో అనర్గళంగా ఇంగ్లిష్లో సంభాషించారట. చట్టాల లోతులను విశ్లేషించారట. చివర్లో మంత్రాక్షతలూ ఇచ్చారట. తన తప్పిదానికి మన్నించమంటూ మన్రో ఉత్తర్వులను వెనక్కి తీసుకొన్నాడట. ఈ విషయాన్ని అధికారిక గెజిట్లోనూ ప్రకటించారు థామస్ మన్రో. ఇలాంటి అద్భుత గాథలను కథలు కథలుగా చెబుతారు.
మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి దర్శనం తర్వాత పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. రాఘవేంద్రస్వామి పీఠాధిపతిగా ఉన్ననాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. స్వామివారు ఉపయోగించిన పాత్రలోనే ఇప్పటికీ అక్షతలు కలుపుతుండటం విశేషం. ఈ మంత్రాక్షతలను శిరస్సున ధరిస్తే.. కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
…? శ్యామ్ప్రసాద్